Cm Revanth Reddy: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 3వ తేదీ వరకు గడువు పొడిగించింది ఈసీ. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల విజ్ఞప్తితో ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ నేతలను మరోసారి అప్రమత్తం చేశారు. నాయకులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తేల్చి చెప్పారు. ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా ప్రతి నాయకుడు క్షేత్రస్థాయిలో ఉండి ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు.
SIR గడువు పొడిగింపుపై వర్చువల్ సమీక్ష నిర్వహించారు రేవంత్ రెడ్డి. కొందరు ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ పై సీరియస్ గా లేరని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు హైదరాబాద్ లో కూర్చుని పని చేయడం లేదన్నారు. నాయకులు పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎస్ఐఆర్ గడువు ముగిసే ఆగస్ట్ 3వ తేదీ వరకు నేతలు ఎవరూ కూడా గాంధీభవన్ కు రావొద్దని రేవంత్ రెడ్డి ఆదేశించారు. వచ్చే 10 రోజులు నాయకులంతా ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లోనే పర్యటించాలని రేవంత్ రెడ్డి చెప్పారు.
''ఎస్ఐఆర్ బాధ్యతలు అప్పగించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ ఇన్ఛార్జ్ లు అంతా తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. జిల్లాల వారీగా మంత్రులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలి. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమన్వయ బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వహించాలి'' అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
''ఆగస్టు 3 వరకు గాంధీభవన్కు ఎవరూ రావొద్దు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరిగేవారికి నియామకాలు ఉండవు. జూలై 30న మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు పరిశీలిస్తాం'' అని రేవంత్ రెడ్డి అన్నారు.












