Jammu Kashmir Rains: జమ్ముకశ్మీర్ లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్యాప్ లేకుండా కురుస్తున్న వానలు ప్రజలను బెంబేలెతిస్తున్నాయి. నదులు ఉగ్రరూపం దాల్చాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. పూంచ్, రాజౌరీ జిల్లాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా 12 మంది చనిపోయారు. పలువురు గల్లంతయ్యారు. కొండ చరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసం కావడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. రంగంలోకి దిగిన సైన్యం ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వరదల బీభత్సం నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు.
కొన్ని రోజులుగా జమ్ముకశ్మీర్ లో వానలు దంచికొడుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వానలు పడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో జన జీవనం పూర్తిగా స్థంభించిపోయింది. కాగా, రాబోయే కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.












