Vijaya Sai Reddy: ఏపీ మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ కు విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ రాశారు. అనేక రకాల అంశాలను అందులో ప్రస్తావించారు. నమ్మక ద్రోహి అంటూ వైసీపీ కోటరీ తనపై గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆయన వాపోయారు. జగన్ కు తాను వెన్నుపోటు పొడిచానని చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తాను జగన్ కు ఎన్నడూ నమ్మకద్రోహం చేయలేదు, చేయనని విజయసాయిరెడ్డి చెప్పారు.
జగన్ తో పాటు ప్రతి చార్జిషీట్ లోనూ తనను ఏ2గా చేర్చారని ఆయన గుర్తు చేశారు. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే తాను 15 నెలలు జైల్లో ఉన్నానని లేఖలో పేర్కొన్నారు. తనకు సంబంధం లేని లిక్కర్ స్కామ్ లో తనను ఏ5గా చేర్చారని విజయసాయిరెడ్డి వాపోయారు. తాను నమ్మకద్రోహానికి పాల్పడి ఉంటే ఏనాడో అప్రూవర్ గా మారేవాడినని విజయసాయిరెడ్డి అన్నారు.
2020 నుంచి తన ఆత్మగౌరవానికి భంగం కలిగించే పరిణామాలు జరిగాయన్నారు. ఆత్మగౌరవాన్ని చంపుకుని పని చేయలేకపోయానని అన్నారు. 2019 ఎన్నికల విజయం తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభావం ఎలా పెరిగిందో జగన్ ఆలోచన చేయాలని విజయసాయిరెడ్డి సూచించారు. నా సంగతి తర్వాత.. తన కుటుంబసభ్యులపై జగన్ దృష్టి పెట్టాలన్నారు. జగన్ ను రాజకీయంగా మోసం చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. జగన్ తనకు రెండుసార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చారని, అందుకుగాను తనకు కృతజ్ఞత ఉంటుందని విజయసాయిరెడ్డి చెప్పారు. జగన్ పై తనకు ఎలాంటి వ్యక్తిగత కక్ష లేదన్నారు.
తాను కొత్త రాజకీయ పార్టీ పెడతానని ఇటీవలే ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు తాను జగన్ కు నమ్మకద్రోహం చేయలేదు, చేయను అంటూ చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అసలు విజయసాయిరెడ్డి మనసులో ఏముంది? జగన్ కు లేఖ ఎందుకు రాశారు? అనేదానిపై వైసీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.












