Ethics Committee: ఎథిక్స్ కమిటీ కీలక సమావేశం.. పాడి కౌశిక్ రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చ
Ethics Committee: అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎథిక్స్ కమిటీ సమావేశం జరిగింది. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ (వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్), బీజేపీ (రాకేశ్ రెడ్డి), సీపీఐ (కూనంనేని సాంబశివరావు), కాంగ్రెస్ (మధుసూదన్ రెడ్డి) సభ్యులు హాజరయ్యారు. గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ప్రధానంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై చర్చించారు. కౌశిక్ రెడ్డి అంశంపై మరోసారి సమావేశం నిర్వహించాలని ఎథిక్స్ కమిటీలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరోసారి ఎథిక్స్ కమిటీ సమావేశం జరగబోతోంది.
సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి వేలు చూపించి బెదిరించడం, అసభ్య పదజాలం వాడిన అంశంపై విచారణ జరపాలని ఎథిక్స్ కమిటీకి అసెంబ్లీ రెఫర్ చేసిన సంగతి తెలిసిందే. దానిపై ఇవాళ చర్చ జరిగింది. వీడియో అంతా పరిశీలించిన బీఆర్ఎస్ సభ్యులు.. ఎక్కడా వాయిస్ లేదు కేవలం సైగ ద్వారానే జరిగిందని.. కౌశిక్ రెడ్డి చేసిన దాంట్లో అభ్యంతరకర అంశాలు ఏవీ లేవని.. ఈ ఒక్కసారికి పాడి కౌశిక్ రెడ్డిని వదిలేయాలని బీఆర్ఎస్ సభ్యులు ప్రతిపాదించారు. అలాగే సభలో ఇతర సభ్యులు మాట్లాడిన మాటలు కూడా పరిగణలోకి తీసుకోవాలని ఎథిక్స్ కమిటీని డిమాండ్ చేశారు. మరోసారి సమావేశం అయ్యాకే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ సభ్యులు ప్రతిపాదించారు.
సభలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, చేష్టలు అభ్యంతరకంగా ఉన్నాయని.. కచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. సభ హుందాతనం కాపాడాలని ఎథిక్స్ కమిటీని కోరారు. సభ లోపల సభ్యులు హుందాతనంగా వ్యవహరించాలని, సభ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా ఉండాలంటే నియమ నిబంధనలు ఉల్లింఘించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు చేసిన ప్రతిపాదనలను దృష్టిలో ఉంచుకుని పాడి కౌశిక్ రెడ్డి ఒకసారి హాజరై వివరణ ఇచ్చుకునే అవకాశం ఎథిక్స్ కమిటీ కల్పించినట్లుగా తెలుస్తోంది. నోటీసులు జారీ చేసి కౌశిక్ రెడ్డి వివరణ తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
ఇకపై సభలో ఏ సభ్యుడు కూడా నియమ నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడేలా ఉండకుండా ఎథిక్స్ కమిటీ నిర్ణయాలు ఉండాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. బీజేపీ, సీపీఐ కూడా అదే ప్రతిపాదన చేసినట్లు గా తెలుస్తోంది. పాడి కౌశిక్ రెడ్డి కేంద్ర బిందువుగా జరిగిన ఈ సమావేశంలో.. కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయన వివరణ కూడా తీసుకున్న తర్వాతే.. మార్చి 29న జరిగిన ఘటనపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. సభ హుందాగా నడిచేలా చర్యలు తీసుకోవాలని సభ్యులంతా ఎథిక్స్ కమిటీకి నివేదించారు. పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయనతో మాట్లాడి వివరణ తీసుకున్న తర్వాతే ఎథిక్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఎథిక్స్ కమిటీ తదుపరి చర్యలపై ఉత్కంత నెలకొంది.












