ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠమైన వైద్య వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెలలో పర్యటించిన ఆయన, మారుమూల ప్రాంతాల్లో ఉచిత వైద్య సేవలను అందించే 'ఆరోగ్య రథాలను' జెండా ఊపి ప్రారంభించారు. కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు వైద్యం కోసం మైళ్ల కొద్దీ ప్రయాణించే అవసరం లేకుండా, వారి ముంగిటకే నాణ్యమైన వైద్య సేవలను చేర్చడమే ధ్యేయంగా 'సంజీవని' కార్యక్రమాన్ని రూపొందించామని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
గిరిజన ప్రాంతాల్లో కేవలం ఆరోగ్య రక్షణకే పరిమితం కాకుండా కనెక్టివిటీ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. నెట్వర్క్ లేని మారుమూల గ్రామాల్లో సిగ్నల్ సమస్యలను పరిష్కరించేందుకు విస్తృతంగా సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణతో పాటు యోగా, ధ్యానం వంటి శారీరక, మానసిక వికాస కార్యక్రమాలను కూడా ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, విద్యుత్, రహదారుల నిర్మాణంతో ఏజెన్సీ ప్రాంత రూపురేఖలు మారుస్తామన్నారు.
ఈ సందర్భంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంతంలో గిరిజనులకు అందించిన ఆయుర్వేద వైద్య సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన త్యాగానికి నివాళిగా భోగాపురంలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' అని నామకరణం చేసినట్లు తెలిపారు. అలాగే ఇటీవల సంప్రదాయ థింసా నృత్యంతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించి ప్రాంతీయ సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన గిరిజన కళాకారులను, యువతను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గర్భవతులు, బాలింతలు , పిల్లలకు సరైన సమయానికి అత్యవసర వైద్యం అందేలా ఆరోగ్య రథాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యుల కొరత లేకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, సంజీవని ప్రాజెక్టు ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భారం లేకుండా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.












