ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి.. పూర్తిగా మాయం అవ్వలేదని దేశ వ్యాప్తంగా అక్కడక్కడా వెలుగులోకి వస్తున్న కేసులను చూస్తే అర్థం అవుతుంది.. మనిషిలో కోవిడ్ అనేది ఇతర వ్యాధుల లాగే కలిసిపోయిందని దీని గురించి ప్రస్తుతం ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఒకవేళ పరిస్థితి తీవ్రంగా ఉంటే ట్రీట్ మెంట్ తప్పని సరిగా అవసరమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో కోవిడ్ 19 మళ్లీ తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. అమెరికాలో తాజాగా వెలువడుతున్న గణాంకాలు వీటికి కారణమవుతున్నాయి.. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్.. అంటే CDC కథనం ప్రకారం.. దేశవ్యాప్తంగా 47 రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఒక్క రాష్ట్రంలోనూ కేసులు తగ్గుతున్న పరిస్థితి కనిపించడం లేదని.. జార్జియా , అయోవా , విస్కాన్సిన్ లో పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనమి వెల్లడించింది..
ముఖ్యంగా అమెరికాలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా నమోదవుతోందని సమాచారం.. ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని పాఠశాలలు, తరగతులను తాత్కాలికంగా నిలిపివేశాయి. టెక్సాస్లోని శాన్ పెర్లిటా ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఆగస్టు 25, 26 తేదీల్లో క్యాంపస్లను మూసివేసింది. లూసియానాలోని పార్క్ రిడ్జ్ అచీవ్మెంట్ అకాడమీ కూడా ఒక రోజు తరగతులను నిలిపివేసింది.
మరోవైపు కేసులు పెరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితి 2020 లేదా 2021లో కనిపించినంత భయానకంగా లేదని CDC డేటా సూచిస్తోంది. 2026 ఆగస్టు 21 నాటికి పరిస్థితులు తీవ్రంగా లేవని..కానీ కోవిడ్ కేసుల పెరుగుదల మాత్రం నమోదు అవుతున్నట్టు CDC తెలిపింది. ఇక 2020లో కరోనా ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆసుపత్రులు నిండిపోయాయి.. ఆక్సిజన్ కోసం ప్రజలు అల్లాడిపోయారు..
కుటుంబాలకు కుటుంబాలు వైరస్ బారిన పడ్డాయి. లాక్డౌన్లు, క్వారంటైన్లు, మాస్కులు, ప్రయాణ ఆంక్షలు.. ఇవన్నీ అప్పటి భయానక పరిస్థితులకు గుర్తులుగా మిగిలిపోయాయి. అయితే ఈ వైరస్ పూర్తిగా అంతరించిపోలేదు.. దాని వ్యాప్తి మాత్రం మన జీవితాల్లో ఒక సీజనల్ నమూనాగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా వేసవి, శీతాకాలాల్లో కోవిడ్ కార్యకలాపాలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని CDC కూడా పేర్కొంది.
అయితే వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఉన్నవారు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఇతరులకు దూరంగా ఉండటం, అవసరమైతే మాస్క్ ధరించడం, పరిశుభ్రత పాటించడం, వైద్యుల సూచన మేరకు టీకాలు లేదా అప్డేట్ చేసిన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.. ఇక కరోనా వల్ల ఎదుర్కొన్న గత భయానక జ్ఞాపకాలు ఇంకా ప్రజల మనసుల్లో ఉండగానే.. ఇప్పుడు అమెరికాలో మొదలైన ఈ కొత్త పెరుగుదల ఎక్కడి వరకు వెళ్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది..












