Kavitha: ప్రత్యేక రాష్ట్రం వచ్చినా, ప్రభుత్వాలు మారినా తెలంగాణలో ఇంకా ఆంధ్రోళ్ల పెత్తనమే నడుస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత ఆరోపించారు. రేవంత్ సర్కార్ పాలనపై కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి శాఖలో ఆంధ్ర వాళ్ల పెత్తనమే కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఇరిగేషన్, విద్యుత్ ఇలా ఏ డిపార్ట్ మెంట్ లోని చూసినా ఆంధ్రా పెత్తనమే నడుస్తోందన్నారు. యాదగిరి గుట్ట ఆలయ బోర్డులో ఒక ప్రముఖ నటుడి భార్యను మెంబర్ చేయడాన్ని కవిత తప్పుపట్టారు.
యాదగిరి గుట్ట ఆలయం.. మన కోసం ప్రత్యేకంగా కట్టుకున్న గుడి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా పైసా తెలంగాణ ప్రభుత్వం ఇస్తే కట్టిన గుడి అది అని తెలిపారు. ఆ గుడిలో ఆంధ్ర ప్రాంతం వాళ్లు మెంబర్స్ గా ఎలా ఉంటారు? అని కవిత ప్రశ్నించారు. తిరుపతి హుండీలో వేసిన ప్రతి పైసాలో తెలంగాణ వాళ్ల భాగస్వామ్యం ఉంటుందని.. అందుకే టీటీడీ బోర్డులో తెలంగాణ వాళ్లు మెంబర్స్ గా ఉంటారని వివరించారు. అందుకు భిన్నంగా మొత్తం తెలంగాణ పైసలతో కట్టిన యాదాద్రి గుడిలో ఇతర ప్రాంతం వాళ్లని మెంబర్స్ గా ఎలా తీసుకుంటారు? అని రేవంత్ సర్కార్ ను నిలదీశారు.
''బయోకాన్ కంపెనీలో తెలుగు మాట్లాడినందుకు 200 మందిని తీసేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దాని గురించి మాట్లాడదు. ఇవాళ ప్రతి ఆసుపత్రిలో కేరళం ప్రాంతానికి చెందిన నర్సులకు ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నర్సులంటే తక్కువ పైసలు ఇస్తారు. దానిపై మీ ప్రభుత్వం మాట్లాడదు. ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు? రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్ర వాళ్ల చేతుల్లో, ఆంధ్ర ఏజెంట్ గా ఉన్న ముఖ్యమంత్రితో నడుస్తోంది.
ఇంత జరుగుతున్నా ప్రశ్నించాల్సిన బీఆర్ఎస్ మౌనంగా ఉంది. ఎందుకీ మౌనం, ఏం లాలూచీ? లండన్ లాలూచీనా ఇది? నిన్న గాక మొన్న లండన్ లో మీటింగ్ జరిగింది. దాని ప్రభావం ఏమో అని నేను అనుకుంటున్నా. ఆంధ్ర ప్రాంతం వాళ్లకి చెందిన నారాయణ, చైతన్య కాలేజీలపై బీఆర్ఎస్ నాయకులు ఎన్నడూ మాట్లాడింది లేదు. వ్యాపార సంబంధాలు ఉన్నాయి అందుకే మాట్లాడరు. కేటీఆర్ కి ఉన్న ఆంధ్ర ఫ్రెండ్స్, వాళ్లకున్న పర్మిషన్ల సంగతి అందరికీ తెలుసు. అందుకని కేటీఆర్ కూడా మాట్లాడరు.
లండన్ లో లాలూచీ జరగకపోతే వెంటనే హరీశ్ రావుపై క్విడ్ ప్రో కో కేసు ఫైల్ చేయాలి. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హరీశ్ రావు సతీమణి నడిపే కంపెనీ ద్వారా అనేక ఆసుపత్రులకు కోట్ల రూపాయల పాలు సప్లయ్ చేశారు. నారాయణ కాలేజీకి నెలకు 5 కోట్ల రూపాయల పాలు, చైతన్య కాలేజీకి నెలకు 5 కోట్ల రూపాయల పాలు.. అలా 8ఏళ్లలో హరీశ్ రావు కంపెనీ 960 కోట్ల రూపాయల పాలను కేవలం నారాయణ, చైతన్య కాలేజీలకే సప్లయ్ చేశారు'' అని తీవ్ర ఆరోపణలు చేశారు కవిత.












