రాష్ట్రంలోని యువతను జిత్తులమారి కాంగ్రెస్ తెలివిగా మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నగరంలోని సరూర్నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సభ కొద్దిసేపటి కిందటే ప్రారంభం అవ్వగా..కేటీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు తీవ్ర విమర్శలు గుప్పించారు. జగిత్యాల మహాకవి అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాలను ఊటంకిస్తూ..
కాంగ్రెస్ను జిత్తులమారి నక్కగా అభివర్ణించారు. ఒక జిత్తులమారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసిందని అన్నారు. ‘ఒక నక్క ఎవరినీ మోసం చేయనని ప్రమాణం చేసిందట, తోటి జంతువులను ఇక చంపనని ఒక పులి పశ్చాత్తాపపడిందట’ అంటూ అలిశెట్టి ప్రభాకర్ కవిత్వంతోని సారాంశాన్ని కాంగ్రెస్ చేసిన మోసాలతో ఉదాహరించారు. ఇవాళ వీళ్ల మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురుకు మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో గుర్తు తెచ్చుకోండి అంటూ నిరుద్యోగ యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
https://x.com/TeluguScribe/status/2078381759071437054?s=20
పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్ గాళ్లు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమను కురిపిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్ అని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ విడుదల చేసిన యూత్ డిక్లరేషన్లో 24 హామీలు ఇస్తే, ఒక్క హామీ కూడా నెరవేరలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఆనాడు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, రేవంత్ రెడ్డి యూత్ డిక్లరేషన్ పేరిట చేసిన వాగ్దానాలను వీడియో రూపంలో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించారు.
ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి, వడ్డీ లేని రుణాలు, స్కూటీలు ఎక్కడా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, అబద్ధపు హామీలను గుర్తించి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని నిరుద్యోగ యువతకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు.












