భారత తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్
4దశలను ఛేదించి ఎర్త్ ఆర్బిట్లోకి ప్రవేశం..
టీ హబ్ తొలి అద్భుత విజయం
భారత అంతరిక్ష పరిశోధన రంగంలో శనివారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ 'విక్రమ్-1' శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, ఈ చారిత్రాత్మక విజయానికి ముందు లాంచ్ ప్యాడ్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11:30 గంటలకు రాకెట్ బయలుదేరాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో కంప్యూటర్ సిస్టమ్స్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు తాత్కాలికంగా నిలిపివేశారు.

ఆఖరి క్షణంలో ఎదురైన ఈ అంతరాయంతో కొంత ఆందోళన వ్యక్తమైనప్పటికీ, ఇస్రో మరియు సాంకేతిక బృందం అత్యంత వేగంగా స్పందించింది. రాకెట్ సిస్టమ్స్లో తలెత్తిన సమస్యను నిశితంగా పరిశీలించి, కొన్ని నిమిషాల్లోనే లోపాన్ని విజయవంతంగా సరిచేసింది. అనంతరం మళ్లీ కౌంట్డౌన్ను ప్రారంభించి, నిర్దేశిత సమయం కంటే 35 నిమిషాల ఆలస్యంగా.. అంటే మధ్యాహ్నం 12:05 గంటలకు రాకెట్ను నింగిలోకి పంపారు. సాంకేతిక సమస్యను సమర్థవంతంగా అధిగమించిన తర్వాత విక్రమ్-1 రాకెట్ శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నుండి నిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయాణమైంది.
భారత అంతరిక్ష పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గౌరవార్థం నామకరణం చేసిన ఈ రాకెట్ను హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్టార్టప్ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్' ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసింది. పూర్తిగా ప్రైవేటు రంగంలో అత్యాధునిక సాంకేతికతతో ఈ రాకెట్ను నిర్మించారు. ఇది మూడు సాలిడ్-ఫ్యూయల్ (ఘన ఇంధన) స్టేజ్లు మరియు ఒక లిక్విడ్ ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ సహాయంతో పనిచేస్తుంది. ప్రైవేట్ భాగస్వామ్యంతో అంతరిక్ష రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించే దిశగా ఈ ప్రయోగం ఒక కీలక మైలురాయిగా నిలిచింది.
ఈ విక్రమ్-1 రాకెట్ మొత్తం ఏడు అంతస్తుల భవనమంత ఎత్తు ఉంటుంది. రాకెట్ బరువును తగ్గించడం కోసం దీనిని పూర్తిగా కార్బన్ కంపోజిట్ స్ట్రక్చర్తో నిర్మించడమే కాకుండా, స్వదేశీ సాంకేతికతతో కూడిన 'త్రీడీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లు', 'హై-థ్రస్ట్ సాలిడ్ రాకెట్లను' ఇందులో ఉపయోగించారు. భూమికి దాదాపు 450 కిలోమీటర్ల ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లోకి, 60 డిగ్రీల వంపుతో (inclination) సుమారు 350 కిలోల బరువు గల ఉపగ్రహాలను సురక్షితంగా ప్రవేశపెట్టేలా ఈ మిషన్ను రూపొందించారు.
https://x.com/ANI/status/2078368358353768853?s=20

‘టీహబ్’ సరికొత్త చరిత్ర
హైదరాబాద్కు చెందిన ప్రముఖ స్టార్టప్ ల్యాబ్ ‘టీహబ్’(T-Hub) వేదికగా రూపుదిద్దుకున్న 'స్కైరూట్ ఏరోస్పేస్' సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇస్రో చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ అయిన 'విక్రమ్-1'ను శ్రీహరికోట నుంచి అత్యంత విజయవంతంగా ప్రయోగించారు. ఈ చారిత్రాత్మక ప్రయోగం విజయవంతం కావడంతో స్కైరూట్ కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తలు, సిబ్బంది సంబురాల్లో మునిగిపోయారు. టీ హబ్ అందించిన ప్రోత్సాహం, మౌలిక వసతులతో ఎదిగిన ఒక స్వదేశీ స్టార్టప్ సంస్థ ఈ స్థాయి గ్లోబల్ సక్సెస్ సాధించడం విశేషం.

సీఎం రేవంత్ రెడ్డి హర్షం
కాగా విక్రమ్-1 ప్రేవట్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ ఘనతపై ప్రశంసలు కురిపించారు. ఈ ఏడాది ఏప్రిల్లో విక్రమ్-1 హార్డ్వేర్ను శ్రీహరికోటకు ట్రాన్స్పోర్ట్ చేసే ప్రక్రియను తతానే జెండా ఊపి ప్రారంభించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ ఫొటోలను తెలంగాణ సీఎంవో తాజాగా విడుదల చేసింది.












