భారత అంతరిక్ష చరిత్రలో మరోసువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశంలోనే ఓ ప్రైవేట్ ఏరోస్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మిషన్ ఆగమన్ పేరుతో శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. ఈ ప్రయోగంతో భారత స్పేస్ ఎకోసిస్టమ్లో కొత్త యుగానికి నాంది పలికినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాగా ఆంధ్రప్రదేశ్ ఉప మఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రాకెట్ ప్రయోగంపై అభినందనలు తెలిపారు. భారతదేశపు తొలి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన విక్రమ్-1 ప్రయోగాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక ప్రయోగం ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికతకు నిదర్శనమని ప్రశంసించారు..
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు కల్పించడం ద్వారా దేశంలో ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధి, స్టార్టప్ల ఎదుగుదలకు కొత్త దారులు తెరుచుకున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ పరిణామంలో ఇస్రో పోషించిన పాత్ర ఎంతో కీలకమని ఆయన కొనియాడారు. శాస్త్రీయ పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు యువతలో సృజనాత్మకత, వ్యాపార దృక్పథాన్ని పెంపొందించడంలో ఇస్రో విశేష కృషి చేసిందన్నారు.
ఈ ప్రయోగం భారత యువశక్తి, శాస్త్రీయ ప్రతిభ, సాంకేతిక సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిందని తెలిపిన పవన్.. సంకల్పం, కృషి, వినూత్న ఆలోచనలతో అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చనే సందేశాన్ని దేశ యువతకు ఈ మిషన్ అందిస్తోందని తెలిపారు.. ఈ అరుదైన విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన స్కైరూట్ ఏరోస్పేస్, ఇస్రో, ఇన్-స్పేస్ సంస్థల శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.
విక్రమ్-1 విజయంతో భారత అంతరిక్ష రంగం మరింత వేగంగా ముందుకు సాగాలని, భవిష్యత్లో మరిన్ని ఘన విజయాలకు ఇది బాటలు వేయాలని ఆకాంక్షించారు. ఈ విజయం కేవలం ఒక రాకెట్ ప్రయోగం మాత్రమే కాకుండా, భారతదేశం సాంకేతికంగా ఎదుగిందనే విషయం ప్రపంచానికి తెలిసేలా చేసిందని తెలిపిన పవన్ కళ్యాణ్.. రాబోయే తరాలకు ఇది స్ఫూర్తిదాయక గాథగా నిలిచి, యువత మరింత పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు ముందుకు సాగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.












