తెలంగాణ పోలీసుల పనితీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రవిమర్శలు గుప్పించారు. పోలీస్ స్టేషన్కు గూండాలు వచ్చి తమ వాళ్లపై దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.వారి మీద కేసులు ఎందుకు పెట్టలేదని, వచ్చిన వాళ్లు ఇంతకు ఎవరని ప్రశ్నించారు. నిన్న తన పీఆర్వో మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
1000 రోజుల కాంగ్రెస్ పాలనపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ దాడులకు తెగబడుతున్నదని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం నిరాశ నిస్పృహల్లో ఉందని, అందుకే ప్రతిరోజూ అటెన్షన్ డైవర్షన్కు పాల్పడుతోందని వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇంటిమీద దాడి చేశారని, ప్రాణాలకు లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన నాయకుడి ఇంటిపైన దాడి జరగడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వారి మీద కేసులు ఎందుకు పెట్టలేదని పోలీసుశాఖను నిలదీశారు.
ఈ క్రమంలోనే సైఫాబాద్ పోలీస్స్టేషన్ లోపల 15 మంది గుర్తుతెలియని దుండగలు..తన పీఆర్వో, పీఏ మీద దాడికి యత్నించారని చెప్పారు. పోలీస్స్టేషన్లో దాడికి ప్రయత్నించింది గుండాలా? పోలీసులా? మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు ఎవరో తేల్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దాడులు చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటే కూడా చేయడం లేదని.. తెలంగాణలో పోలీస్ శాఖ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పని చేస్తుందని ఆరోపించారు.
పోలీస్స్టేషన్లో దాడులకు తెగబడిన గూండాలకు పోలీసులు మద్దతు ఇచ్చి ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం లేదని కేటీఆర్ అన్నారు.తమ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరినా పోలీసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేని ఘోరమైన పరిస్థితి తెలంగాణలో నెలకొందన్నారు. ఈ విషయంలో తప్పకుండా కోర్టులను ఆశ్రయిస్తామని తెలిపారు. కోర్టులో న్యాయం జరుగుతుందని తమకు నమ్మకం ఉందని తెలిపారు.











