రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. తన పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్ మీద జరిగిన దాడిని ఖండించిన ఆయన సోషల్ మీడియా‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. మూకదాడి ఎప్పుడూ హత్యగా ప్రారంభం కాదని, కొన్నిసార్లు అది పోలీస్స్టేషన్లో, యూనిఫాంలో ఉన్న అధికారుల సమక్షంలోనే ప్లాన్ చేసే దాడిగా మొదలవుతుందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం రౌడీయిజానికి మద్దతు ఇస్తూ ప్రోత్సహిస్తున్న తీరును చూస్తుంటే అతి త్వరలోనే వీధుల్లో మూకదాడులు జరుగుతాయేమోనని ఆందోళనగా ఉందన్నారు.
https://x.com/KTRBRS/status/2099648526754185378?s=20
అసెంబ్లీ గేట్ నెంబర్ 3 వద్ద జరిగిన తోపులాట విషయమై విచారణ కోసం సైఫాబాద్ పోలీస్స్టేషన్కు వచ్చిన తన పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్లపై మూకదాడి జరిగినట్టే, అణిచివేతకు లొంగని ఏ తెలంగాణ పౌరుడిపై అయినా జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో అరాచకత్వం పెరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘వెల్ డన్ కాంగ్రెస్, వెల్ డన్ రాహుల్ గాంధీ’ అంటూ ఎద్దేవా చేశారు.
https://x.com/pulsenewsbreak/status/2099553512837480798?s=20
నిన్న విచారణ హాజరయ్యేందుకు వెళ్లిన కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్ మీద పోలీస్స్టేషన్లోనే గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు వేసుకుని వచ్చి దాడి చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. తాజాగా దీనిపై డీసీపీ శిల్పవల్లి క్లారిటీ ఇచ్చారు. ‘డీజే పర్మిషన్ కోసం వచ్చిన వ్యక్తుల్లో కొందరు కేటీఆర్ పీఆర్వోను గుర్తుపట్టారని, అసెంబ్లీ వద్ద న్యూసెన్స్ చేసిన వాళ్లను కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడుతారా? అని వాగ్వాదానికి దిగారని ఆమె పేర్కొన్నారు.
అలా మాట్లాడకూడదని సీఐ వారించడంతో యువకులు పోలీస్స్టేషన్ నుంచి వెళ్లిపోయారని డీసీపీ శిల్పవల్లి తెలిపారు.పోలీస్ స్టేషన్లో ఎలాంటి దాడి జరగలేదని, బీఆర్ఎస్ నాయకులు తమపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారని..దానిపైనా దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.తాము పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించామని దాడి జరిగినట్టు ఎక్కడ లేదని డీసీపీ పేర్కొన్నారు.









