హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని కొందరు వెంటబడి మరి నరికి చంపారు. ఈ ఘటన నగరంలోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు.సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే మహమ్మద్ నహీమ్ ఇల్లందు నుంచి నగరానికి వచ్చి బండ్లగూడ సహభావన అపార్ట్మెంట్లో నివాసముంటున్నాడు. విషయం తెలుసుకున్న మహేశ్.. అతన్ని అంతం చేయాలని తిరుగుతున్నట్టు సమాచారం. మహేశ్ తనను ఎక్కడ చంపేస్తాడో అని భయంతో బండ్లగూడలోని సుప్రీం వన్స్ షాపులో తలదాచుకున్న నయీమ్ను.. మహేశ్ మరికొందరి సాయంతో మర్డర్ చేసినట్టు తెలిసింది.
నయీమ్ వైన్స్లో తలదాచుకున్నట్టు సమాచారం రావడంతో మహేశ్ మరికొందరితో కలిసి కారులో అక్కడకు చేరుకున్నట్టు సమాచారం.నయీమ్తో ముందుగా గొడవకు దిగిన మహేశ్ అండ్ గ్యాంగ్.. అతనిపై విచక్షణా రహితంగా దాడి చేసినట్టు తెలిసింది. వైన్స్ పర్మిట్ రూంలో ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నయీమ్ను.. మహేశ్ అండ్ గ్యాంగ్ వెంటాడి మరీ వేట కొడవళ్లు, కత్తులతో దారుణంగా నరికి చంపారు.
https://x.com/TeluguScribe/status/2099722542902829474?s=20
అనంతరం దుండగులు కారులో పారిపోయినట్టు తెలిసింది. మృతుడు నయీమ్, మహేశ్ ఇద్దరిపైనా ఇప్పటికే పలు హత్య కేసులు, ఇల్లందు పోలీస్ స్టేషన్లో రౌడీషీట్లు ఉన్నట్టు సమాచారం. హత్య జరుగుతున్న సమయంలో అక్కడే మద్యం సేవిస్తున్న కొందరు భయంతో పరుగులు తీసినట్టు తెలిసింది. హత్య చేసి పరార్ అయిన నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్నట్టు నాగోల్ పోలీసులు తెలిపారు.











