తెలంగాణలో విద్యా వ్యవస్థ గాడితప్పుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇందుకు పలుకారాణాలున్న తాజాగా రాష్ట్రంలోని వివిధ యూనివర్శిటీల పరిధిలోని కాలేజీల్లో విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న బయోమెట్రిక్ హాజరు ఫీజుల వ్యవహారం సంచలనంగా మారింది. పలు కాలేజీల్లో బయోమెట్రిక్ ఫీజు పేరిట ఒక్కో సెమిస్టర్కు ప్రతి విద్యార్థి దగ్గర నుంచి రూ. 100 వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
గత ఆరేళ్ల బయోమెట్రిక్ వివరాలను పరిశీలిస్తే ఇలాంటి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.. దాదాపు సగానికి పైగా ఓయూ పరిధిలో ఉన్న ఎంబీఏ కాలేజీల్లో అసలు అధ్యాపకులుండరు. మౌలిక వసతులుండవు. కాలేజీలకు తాళాలు వేసి ఉంటాయనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులు కాలేజీలకు రాకుండా పరీక్షల సమయంలో మాత్రమే హాజరవుతున్నారని తెలుస్తుంది.
ఈ పరిస్థితుల్లో బయోమెట్రిక్ విధానం అమలవడం సాధ్యం కాదు.. అందుకే ఈ అంశం పై చర్చలు మొదలైయ్యాయి.. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు అమలవుతోందో లేదో పర్యవేక్షించని వర్సిటీ అధికారులు, విద్యార్థుల నుంచి మాత్రం బయోమెట్రిక్ ఫీజు ఎందుకు చెల్లించుకోవాలని డిగ్రీ, ఎంబీఏ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి.
ఇక యూనివర్శిటీ నిబంధనల ప్రకారం 75 శాతానికిపైగా హాజరు ఉంటేనే పరీక్షలు రాయడానికి అనుమతి ఇవ్వాలి. కానీ చాలా వరకు విద్యార్థులు అసలు కాలేజీలకే వెళ్లకుండా నకిలీ ప్రాజెక్టు రిపోర్టులు సైతం సబ్మిట్ చేసి సర్టిఫికెట్లు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. బయోమెట్రిక్ హాజరును లెక్కించాల్సిన ఓయూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, మెజారిటీ కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరుపై మానిటరింగ్ లేకుండానే విద్యార్థుల నుంచి మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నారని, ఇలా ఆరేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ఇక అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఓయూ పరిధిలో ప్రతి సెమిస్టర్కు సుమారు 10 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో డిగ్రీలో 4.50 లక్షలు, పీజీలో లక్ష, ప్రొఫెషనల్ కోర్సుల్లో 2 లక్షలు, ఇంజనీరింగ్లో 3 లక్షల మంది ఉన్నారు. వీరందరి నుంచి సెమిస్టర్కు రూ. 100 చొప్పున వసూలు చేసినా, ఒక్క ఓయూ పరిధిలోనే కోట్లలో ఫీజులు వసూలవుతున్నట్టు అంచనా..
అయితే, విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఈ బయోమెట్రిక్ ఫీజుకు తగినట్లుగా అన్ని కాలేజీల్లో యంత్రాలు ఏర్పాటు చేశారా? అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా? అని నిర్ధారించే ఇన్స్టాలేషన్, సర్వర్, నిర్వహణ రికార్డులు ఎక్కడ ఉన్నాయి? ఈ నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
కేవలం ఓయూకే పరిమితం కాకుండా కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన తదితర వర్సిటీల్లోనూ బయోమెట్రిక్, రీవాల్యుయేషన్ ఫీజుల వసూళ్లపై వాస్తవ రికార్డుల ఆధారంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు..












