కాలుష్యంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం..
ఆంధ్రా పేపర్స్కు సమన్లు జారీ చేయాలని ఆదేశం..
2016 నుంచి పన్నులు చెల్లించలేదన్న ఆరోపణలు
గోదావరి తీరంలో ఇప్పుడు ఓ పేపర్ మిల్ వ్యవహారం హాట్టాపిక్గా మారింది. ఒకవైపు పరిశ్రమ నుంచి భారీగా ద్రవ వ్యర్థాలు వెలువడుతున్నాయన్న ఆరోపణలు.. మరోవైపు స్థానిక సంస్థలకు కోట్ల రూపాయల పన్ను బకాయిలు ఉన్నాయన్న విమర్శలు.. ఈ రెండు అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ లిమిటెడ్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించారు. సంస్థకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు సమన్లు జారీ చేసి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
పవన్ కన్నెర్ర.. అసలు వివాదమేంటి?
ఆంధ్రా పేపర్ లిమిటెడ్ వల్ల రాజమహేంద్రవరం ప్రాంతంలో కాలుష్యం పెరుగుతోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ముఖ్యంగా గోదావరిలోకి చేరుతున్న ద్రవ వ్యర్థాలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న అధికారిక కాలుష్య డేటాను ప్రస్తావిస్తూ.. రాజమహేంద్రవరం నగరంలో రోజుకు సుమారు 7 కోట్ల లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో దాదాపు 3.5 కోట్ల లీటర్లు ఆంధ్రా పేపర్ నుంచే వస్తున్నాయని పవన్ పేర్కొన్నారు. అంటే నగర మొత్తం ద్రవ వ్యర్థాల్లో దాదాపు సగం ఈ పరిశ్రమ నుంచే వస్తోందన్నది ఆయన వాదన.
పేపర్ మిల్ నుంచి వెలువడే వ్యర్థాల్లో అనుమతించిన ప్రమాణాల కంటే కొన్ని కాలుష్య కారకాలు అధికంగా ఉన్నాయని పవన్ తెలిపారు. డిశ్చార్జ్ లాగూన్ల సమీపంలో సేకరించిన నమూనాల్లో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 36 మిల్లీగ్రాములు నమోదైందని, ఇది నిర్దేశిత పరిమితి కంటే 20 శాతం ఎక్కువని చెప్పారు. ఫాస్ఫేట్ 5.3 మిల్లీగ్రాములు, సల్ఫైడ్స్ 3.4 మిల్లీగ్రాములుగా ఉన్నాయని.. సల్ఫైడ్స్ స్థాయి నిర్దేశిత ప్రమాణం కంటే 70 శాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
రూ.21.34 కోట్ల బకాయిలు..
కాలుష్యంతో పాటు పన్నుల అంశం కూడా ఇప్పుడు ఈ వివాదంలో కీలకంగా మారింది. ఆంధ్రా పేపర్ లిమిటెడ్ 2016 నుంచి కాతేరు గ్రామపంచాయతీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు పన్నులు చెల్లించలేదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. స్థానిక సంస్థలకు మొత్తం రూ.21.34 కోట్ల వరకు పన్ను బకాయిలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. పన్నులు చెల్లించాలని నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయిస్తూ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారంటూ పవన్ విమర్శించారు.
అయితే మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు మాత్రమే ఆంధ్రా పేపర్ నుంచి వడ్డీ, జరిమానాలతో కలిపి రూ.17.34 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఇందులో అసలు పన్ను డిమాండ్ రూ.9 కోట్లు కాగా, సంస్థ ప్రస్తుతం ఏడాదికి రూ.58.82 లక్షలు చెల్లిస్తోందని.. వార్షిక డిమాండ్ రూ.1.26 కోట్లు ఉందని వివరించారు. పన్ను చెల్లింపులకు సంబంధించిన పలు కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని చెప్పారు.
‘సమయం ఇచ్చాం.. స్పందన లేదు’
కాలుష్య సమస్యపై ప్రభుత్వం ఇప్పటికే సంస్థకు సమస్యలను సరిదిద్దుకునే అవకాశం ఇచ్చిందని పవన్ తెలిపారు. తన ఫీల్డ్ విజిట్ సందర్భంగా భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించినప్పటికీ అవి అమలు కాలేదని ఆయన ఆరోపించారు. గత మూడు నెలల్లో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంస్థ ప్రతినిధులతో పలుమార్లు సమావేశమై అవసరమైన చర్యలను సూచించినప్పటికీ తగిన స్పందన రాలేదని పవన్ చెప్పారు.
ఇక ఆలస్యం చేయకుండా ఆంధ్రా పేపర్కు సమన్లు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలు ప్రారంభించాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలిని పవన్ ఆదేశించారు. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం, జరిమానాలు విధించడం, పరిశ్రమను స్వాధీనం చేసుకోవడం లేదా లైసెన్స్ రద్దు చేయడం వంటి కఠిన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
కోర్టుల్లో కేసులు.. కంపెనీ వాదన ఏంటి?
అయితే ఈ వ్యవహారంలో మరో కోణం కూడా ఉంది. ఆంధ్రా పేపర్ సంస్థ గతంలోనే వివిధ పన్ను డిమాండ్లను కోర్టుల్లో సవాల్ చేసిందని సమాచారం. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ తమ సంస్థకు వీధి దీపాలు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా వంటి పౌర సేవలు అందించడం లేదని సంస్థ వాదించినట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశంపై పన్ను డిమాండ్లను సంస్థ కోర్టుల్లో సవాల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పన్ను బకాయిల పరిష్కారంపై మున్సిపల్ సంస్థతో చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గోదావరి.. 2027 పుష్కరాల ముందు కీలకంగా మారిన అంశం
ఈ వివాదం తెరపైకి రావడం మరో కారణంతోనూ ప్రాధాన్యం సంతరించుకుంది. 2027లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో నది కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లోనూ ఆంధ్రా పేపర్కు సంబంధించిన కొన్ని పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి గుర్తించిన విషయాలు నమోదయ్యాయి. శుద్ధి చేసిన వ్యర్థ జలాల కోసం ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం లేదా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని అమలు చేయాలని సూచనలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇక ముందు ఏం జరుగుతుంది?
ఇప్పటివరకు ఆరోపణలు, నోటీసులు, కోర్టు వ్యవహారాలతో సాగిన ఈ అంశం ఇప్పుడు అధికారిక చర్యల దశకు చేరింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించిందా? పన్ను బకాయిల విషయంలో సంస్థ వాదన ఎంతవరకు చెల్లుతుంది? కాలుష్య నియంత్రణ మండలి పరిశీలనలో తేలేది ఏమిటి? అన్నదే ఇప్పుడు కీలకం. ఒకవేళ నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
గోదావరి కాలుష్యం, కోట్ల రూపాయల పన్ను బకాయిలు, కోర్టు కేసులు, ప్రభుత్వ హెచ్చరికలు. ఇవన్నీ కలసి ఆంధ్రా పేపర్ వ్యవహారాన్ని ఇప్పుడు ఏపీ రాజకీయ, పర్యావరణ వర్గాల్లో చర్చనీయాంశంగా మార్చాయి. ముఖ్యంగా పర్యావరణ శాఖను స్వయంగా పర్యవేక్షిస్తున్న పవన్ కల్యాణ్ ఈ అంశాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారన్నదే తదుపరి పరిణామాలను నిర్ణయించనుంది.







