కొడంగల్ అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తన సొంత నియోజకవర్గంలో రెండు రోజుల పాటు విస్తృతంగా పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.. అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలిస్తూ.. వాటి పురోగతి, నాణ్యత, పూర్తయ్యే గడువుపై అధికారులను ఆరా తీస్తున్నారు.. రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు మద్దూరు, దౌలతాబాద్, దుద్యాల మండలాల్లో సీఎం పర్యటించారు.
ముందుగా మద్దూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మొత్తం నాలుగు ఎకరాల స్థలంలో 13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో భవనాన్ని నిర్మిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ క్రమంలో కళాశాలలో తరగతి గదులు, ప్రయోగశాలలు, ఇతర సౌకర్యాలపై ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు. కళాశాల పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని కూడా సర్వే చేయించాలని కలెక్టర్ను ఆదేశించారు.
అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి.. కళాశాలకు విశాలమైన ప్రాంగణంతో పాటు ప్రహరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. మరోవైపు మార్చి నెలలోపు మద్దూరు డిగ్రీ కళాశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసి.. వచ్చే విద్యా సంవత్సరం వరకు విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో జాప్యం ఉండకూడదని.. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని అధికారులకు సూచించారు..
అనంతరం చింతల్దిన్నె వైపు కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల నిర్మాణ పనులను సైతం సీఎం పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన.. నిర్ణీత గడువులోగా నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గురుకుల పాఠశాల నిర్మాణానికి స్థలం ఇచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
అనంతరం దౌలతాబాద్ మండలంలో పర్యటించిన సీఎం.. గోకఫసల్వాద్లో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను పరిశీలించారు. దౌలతాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణ పనులపైనా అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థల నిర్మాణాలను వేగవంతం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. తర్వాత దుద్యాల మండలం హకీంపేటలోని కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్ను సందర్శించిన సీఎం.. అక్కడ కొనసాగుతున్న విద్యాసంస్థలు, మౌలిక వసతుల నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మరోవైపు ఎడ్యుకేషన్ హబ్లో నిర్మిస్తున్న 430 పడకల ఆసుపత్రి పనులపై కూడా సీఎం ప్రత్యేకంగా సమీక్షించారు. నిర్మాణంలో నాణ్యత, సాంకేతిక ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా అవసరమైన ప్రాంతాల్లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నింటినీ సమగ్రంగా పర్యవేక్షించాలని.. పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
ఈ క్రమంలో పనుల్లో జాప్యం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి నేడు కూడా కొడంగల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు.. కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించనున్నారు. 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్, ఆర్అండ్బీ గెస్ట్హౌస్, పాఠశాల భవనం తదితర నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అలాగే కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే కార్యక్రమంలో సీఎం ప్రసంగించనున్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తూ.. కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా సీఎం పర్యటన కొనసాగుతోంది.







