నిత్యం నిర్లక్ష్యం వల్ల ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో లెక్కేలేదు.. క్షణకాలం తొందర.. ఒక్క చిన్న నిర్లక్ష్యం.. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తోంది. వాహన చోదకుల అజాగ్రత్త.. అతివేగం.. ట్రాఫిక్ నిబంధనలను పట్టించుకోకపోవడం..వెరసి నిత్యం రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అందుకే రహదారులపై ప్రయాణం అంటే యమపురికి పయనమే అనే భావన నెలకొంటుంది... మొత్తానికి అతివేగం, అశ్రద్ధ నిండు నూరేళ్ల జీవితాలను నడిరోడ్డుపై బలితీసుకుంటున్నాయి.
ఇక హైవేలపై చోటు చేసుకునే ప్రమాదాల తీవ్రత ఒక్కో సారి ఊహించని విధంగా ఉంటుంది.. ఆ సమయంలో నల్లని తారు రోడ్లు రక్తం రుచి మరిగిన రక్కసిలా కనిపిస్తాయి.. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న.. రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు. ఇక తాజాగా నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
నెల్లికల్ ఎక్స్ రోడ్ సమీపంలోని దయ్యాల గండి వద్ద ద్విచక్ర వాహనంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడు నాగార్జునసాగర్ పైలాన్కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. కారు అతివేగంగా రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటన కారణంగా నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు సమాచారం.. అలాగే ప్రదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది..
ఇక గమ్యం చేరుకోవడానికి సమయం మించిపోతుందని తొందరపడితే.. ఆ ప్రయాణమే మీ జీవితానికి చివరి మజిలీ కావచ్చు! కాస్త లేట్ అయితే సమయం మాత్రమే పోతుంది, కానీ అతివేగంతో తొందరపడితే ప్రాణాలే పోతాయని నిత్యం జరుగుతున్న ప్రమాదాలు గుర్తు చేస్తున్నాయి..












