కాంగ్రెస్ పార్టీ తీరు,వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు కరీంనగర్కు వెళ్లనున్నారు.రానున్న రోజుల్లో ప్రభుత్వ తలరాతను డిసైడ్ చేసేది యువతరం అని గుర్తించిన కేటీఆర్.. వారితో ఇటీవల తరచూ ఇంటరాక్ట్ అవుతున్నారు.వచ్చే ఎన్నికల్లో యువతరమే టార్గెట్గా బీఆర్ఎస్ పార్టీ విధివిధానాలు సైతం ఖరారు చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా రైతులు, మహిళలు సంక్షేమం, ఆ తర్వాత యువతరమే బీఆర్ఎస్ ఎన్నికల ప్రధానాస్త్రం కానుందని సమాచారం.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అటు అన్నదాతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.రైతుభరోసా, బోనస్, రుణమాఫీ, కౌలురైతులకు సాయం ఇవన్నీ నెరవేర్చలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల కారణంగా వర్షాలు కురవడం లేదు. దీంతో సాగు నీరు లేక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మొన్న మిర్యాగగూడ సభలో కేటీఆర్.. ప్రభుత్వానికి 10 రోజుల గడువు పెట్టారు.
ఆలోపు సాగర్ ఎడమ కాలువ నుంచి నల్గొండ రైతులకు సాగు నీరు ఇవ్వకపోతే కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేస్తానని అల్టిమేటం జారీ చేశారు. ఇక నోటిఫికేషన్లు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను సర్కార్ మోసం చేసిందని విమర్శిస్తున్న కేటీఆర్.. నేడు కరీంనగర్లో ‘జెన్ జీ’తో భారీ సభను నిర్వహిస్తున్నట్టు సమాచారం.
కరీంనగర్లోని అంబేద్కర్ మినీ స్టేడియంలో జెన్ జీ సభ కోసం వేగంగా ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆ సభ ఏర్పాట్లను పరీశీలించారు. మధ్యాహ్నాం సభ ప్రారంభంకానుందని సమాచారం. ఈ క్రమంలోనే విద్యార్థులు, యువతతో కేటీఆర్ సమావేశం అవుతారని, ఉద్యోగ అవకాశాలు, ఫీజు రీయింబర్స్మెంట్పై చర్చ జరగనుందని తెలుస్తోంది. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జెన్ జీ సభ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేయనున్నట్టు సమాచారం.









