జూన్ 9వ తేదీన కనిపించకుండా పోయిన బాలికను ఎట్టకేలకు ఏపీ పోలీసులు కనిపెట్టారు. తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు నెలలు గడిచిందని అయినా ఆచూకీ కనిపెట్టలేకపోయారని బాలిక తండ్రి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన కోర్టు.. గుంటూరు జిల్లా పోలీసుల పనితీరుపై మండిపడింది. తెల్లవారే సరికి బాలికను న్యాయస్థానం ముందు హాజరు పరచాలని ఆదేశాలు ఇవ్వడంతో .. బాలిక ఆచూకీని కనిపెట్టేందుకు ప్రత్యేకంగా ‘సిట్’ వేసిన ఏపీ డీజీపీ.. విచారణ చేపట్టగా.. హర్యానాలో బాలిక ఆచూకీని గుర్తించారు.
ఇన్స్టా మిస్డ్కాల్ ద్వారా గుంటూరులో కనిపించకుండా పోయిన బాలిక కేసును పోలీసులు చేధించినట్టు తెలిసింది. బాలిక మిస్సింగ్ కేసులో షేక్ జాన్సైదాను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా పట్టాభిపురంలో పదో తరగతి చదువుతున్న బాలికకు.. ఇన్ స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయినా జాన్ సైదా.. మాయమాటలు చెప్పి ఆమెను కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు.మూడు నెలలుగా పోలీసుల కళ్లుగప్పి నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నట్టు సమాచారం.
అయితే,విచారణలో భాగంగా బాలిక ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తల్లిదండ్రులకు మిస్డ్కాల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మిస్డ్కాల్ ఆధారంగా పోలీస్ ఐటీ విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది. బాలిక 3 ఇన్స్టా ఖాతాలు, నిందితుడు 7 ఇన్స్టా ఖాతాలు వినియోగించినట్లు గుర్తించారు. పదే పదే ఇన్స్టా ఖాతాలు మార్చినా నిందితుడి లోకేషన్ ట్రేస్ చేయగా.. హరియాణాలోని కర్నాల్ బుధాఖేరాలో పోలీసులకు నిందితుడు జాన్సైదా చిక్కాడు. బాలికను కూడా అక్కడే రక్షించారు.
బాలికను ట్రాప్ చేసేందుకు వారం ముందు నిందితుడు గుంటూరులో మకాం వేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.గుంటూరు నుంచి నెల్లూరు, చెన్నై, కోయంబత్తూరు, కేరళ, హైదరాబాద్ మీదుగా హరియాణాకు బాలికను హర్యానా తీసుకుని వెళ్లినట్టు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా నిందితుడు గుంటూరులోనే సెకండ్ హ్యాండ్ బైక్, సిమ్ కార్డులు సమకూర్చుకున్నట్టు తెలిసింది.బాలిక హర్యానాలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు... స్థానిక ఖాకీల సాయంతో నిందితుడిని పట్టుకుని బాలికను సేఫ్గా రక్షించారు. ఎట్టకేలకు బాలిక దొరకడంతో పోలీసులు, బాధిత పేరెంట్స్ ఊపిరిపీల్చుకున్నారు.











