అన్నదాత మరణిస్తే బాధిత కుటుంబానికి భరోసాగా గత ప్రభుత్వం చెల్లించిన రెతు బీమా రూ.5 లక్షలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిచిపోయినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో రైతు భరోసా, రైతుభీమా కొనసాగిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి రాగానే రైతు బీమా నిలిపి వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పెట్టుబడి సాయం కింద రైతు భరోసా రావడం లేదని, రుణమాఫీ చేయడం లేదని అన్నదాతలు ఇప్పటికే రేవంత్ సర్కారు మీద గరం అవుతున్నారు.
తాజాగా రైతుబీమా కూడా నిలిచిపోయిందని తెలియడంతో మృతి చెందిన రైతుల కుటుంబాలు తలలు పట్టుకుంటున్నాయి. అప్పుల బాధతో చాలా మంది రైతులు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. రైతు బీమా వస్తే అప్పులు కట్టేసి ప్రశాంతంగా ఉందామని భావించిన కుటుంబాలకు నిరాశే మిలిగింది. సాగు నీళ్లు లేక, పంటలు పండగ, మద్దతు ధర రాక, పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో అప్పుల పాలై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అలా మరణించిన రైతుల కుటుంబాలు ఆగం కావొద్దనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది. 2018 ఆగస్టు 15న రైతు బీమా పథకాన్ని నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. రైతు పేరిట గుంట వ్యవసాయ భూమి ఉన్నా రైతుకు బీమా పథకం వర్తింపజేసేలా స్కీంను రూపొందించారు. 2018-19 నుంచి 2025-26 వరకు 1,86,363 మంది రైతులు మరణించగా, వారి కుటుంబాలకు మొత్తం రూ.9,107.80 కోట్లను ప్రభుత్వాలు పరిహారంగా అందించాయి.
రైతు బీమా పథకం పరిధిలో సుమారు 42.16 లక్షల మంది రైతుల కోసం ఏటా రూ.1,400 కోట్ల వరకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వాలు చెల్లిస్తూ వచ్చాయి. అయితే, ఎనిమిదేళ్లుగా అన్నదాత కుటుంబాలకు అండగా నిలిచిన రూ.5 లక్షల భరోసాను తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసినట్టు తెలిసింది.నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం బర్కత్పల్లి గ్రామానికి చెందిన 45 ఏళ్ల దళిత రైతు ఒర్సు రాంచందర్ గత నెల 29న గుండెపోటుతో మృతి చెందాడు.
https://x.com/TeluguScribe/status/2096105711776256148?s=20
ఆయనకు అర ఎకరం భూమి, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబపెద్ద మరణంతో రాంచందర్ మిత్రులు రూ.5 లక్షల రైతుబీమా కోసం స్థానిక ఏఈఓను కలవగా.. రైతుబీమా పథకం ఆగస్టు 14 నుంచి నిలిచిపోయిందని, బీమా క్లెయిమ్ కాదని చెప్పడంతో రాంచందర్ కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. గత కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన ఈ పథకాన్ని అర్ధాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో బాధిత రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. వెంటనే రైతు బీమా స్కీంను పునరుద్దరించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.











