తెలంగాణ

Telangana: తెలంగాణ కౌలు రైతులకు గుడ్‌న్యూస్‌.. కీలక నిర్ణయం దిశగా రేవంత్ సర్కార్!..

రచన: Venu6 నిమిషాల పఠనం

ప్రస్తుతం రాష్ట్రంలో కౌలు భూమి గణనీయంగా పెరిగినట్లు అంచనాలు ఉన్నాయి. సుమారు 25 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి. వీరికి గుర్తింపు లేకపోవడంతో సాగు చేస్తున్న భూమిపై ప్రభుత్వ సహాయం పొందడం కష్టంగా మారింది..

తెలంగాణలో కౌలు రైతుల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. భూమిని సాగు చేస్తున్నా.. రైతుగా గుర్తింపు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న పరిస్థితి. రైతు భరోసా, రైతు బీమా, పంట రుణాలు మాత్రమే కాదు.. పంటకు అవసరమైన ఇన్‌పుట్ సబ్సిడీలు పొందడంలోనూ కౌలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా కౌలు రైతులకు ఈ సమస్య రావడానికి కారణం.. భూమిని కౌలుకు తీసుకున్న రైతు దగ్గర సాధారణంగా భూమికి సంబంధించిన హక్కు పత్రాలు ఉండవు.

ఆ పత్రాలు భూ యజమాని దగ్గరే ఉంటాయి. అయితే కౌలుదారుడికి పత్రాలు ఇస్తే.. భవిష్యత్తులో తన భూమిపై హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందనే భయం కొందరు పట్టాదారుల్లో ఉంది. పాత కౌలు చట్టాలపై ఉన్న అపోహలు, సరైన అవగాహన లేకపోవడం ఈ సమస్య తలెత్తుతుంది.. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల గుర్తింపునకు ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నారు. అక్కడ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి.. ప్రభుత్వ పథకాలు, రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు.

మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఆ హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కౌలుదారుల గుర్తింపుపై ఇప్పటికే తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రెండు సార్లు నివేదికలు సమర్పించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు ఈ కమిటీలో ఉన్నట్లు తెలుస్తుంది.

ఇక కౌలు రైతును గుర్తిస్తే.. భూ యజమాని హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ఈ వ్యవస్థ రూపొందించాలి? రాతపూర్వక ఒప్పందం లేని సందర్భంలో కౌలు చేస్తున్నట్లు రైతు ఎలా నిరూపించాలి? వరుసగా మూడేళ్లు భూమిని సాగు చేస్తే భూమిపై హక్కులు వస్తాయనే అపోహలను ఎలా తొలగించాలనే అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో కౌలు భూమి గణనీయంగా పెరిగినట్లు అంచనాలు ఉన్నాయి. సుమారు 25 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి. వీరికి గుర్తింపు లేకపోవడంతో సాగు చేస్తున్న భూమిపై ప్రభుత్వ సహాయం పొందడం కష్టంగా మారింది.. ఈ క్రమంలో రైతు కమిషన్ ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని సూచనలు చేసింది. భూమి ఆధీకృత సాగుదారు చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం ఒక మార్గం.

ఈ కార్డులు పరిమిత కాలానికి మాత్రమే చెల్లుబాటు అయ్యేలా చేస్తే.. భూ యజమానులకు హక్కులు కోల్పోతామనే భయం తగ్గే అవకాశం ఉంది. మరో మార్గం.. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న పద్ధతులను పరిశీలించడం. పట్టాదారుడు, కౌలుదారుడు సాగుకు సంబంధించి సాధారణ ఒప్పందం చేసుకుని.. గ్రామస్థాయి అధికారుల ధ్రువీకరణతో గుర్తింపు కల్పించే విధానం కూడా ఒక పరిష్కారంగా సూచిస్తున్నారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ, ఈ-క్రాప్ వంటి సాంకేతిక విధానాలను ఉపయోగించి.. వాస్తవంగా భూమిని సాగు చేస్తున్న రైతును గుర్తించే అవకాశమూ ఉంది.. ఇంకో ప్రతిపాదన ప్రకారం.. కౌలుదారు తన సాగు వివరాలను తెల్లకాగితంపై దరఖాస్తుగా సమర్పించాలి. గ్రామసభలో ఆ వివరాలను బహిరంగంగా ప్రకటించాలి. భూ యజమాని అభ్యంతరం వ్యక్తం చేయకపోతే.. ఆ ఏడాదికి మాత్రమే కౌలు రైతుగా గుర్తింపు ఇవ్వొచ్చు.

మొత్తానికి కౌలు రైతుకు ప్రభుత్వ సాయం అందాలి.. అదే సమయంలో భూ యజమాని హక్కులకు ఎలాంటి నష్టం జరగకూడదు. ఈ రెండు అంశాలను సమతుల్యం చేసే విధానమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియపై ఉన్న అపోహలు, భూ యజమానుల భయాలు తొలగించి.. సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వ సహాయం అందేలా స్పష్టమైన విధానం తీసుకురావాల్సిన అవసరం మరింత పెరిగింది.

#Telangana#Tenant Farmers#Agriculture#Rythu Bharosa#Revanth Reddy#Agriculture Commission#CCRC Cards
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి