రాజకీయాలు

రైతన్నలకు సర్కార్ భరోసా.. ఆరు ఎకరాల లోపు రైతులకూ నగదు విడుదల!..

రచన: Desk 23 నిమిషాల పఠనం

రాష్ట్రంలో రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రజా ప్రభుత్వం.. వారి సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. వానాకాలం సాగుకు అవసరమైన పెట్టుబడి సకాలంలో అందేలా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయాన్ని జమ చేస్తోంది. రైతు కుటుంబాలకు అండగా నిలుస్తూ, వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది.

రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు ఊపందుకుంటున్న వేళ, రైతుల కోసం ప్రజా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకం కింద ఐదో విడత నిధులను శనివారం విడుదల చేసింది.

ఈ విడతలో ఆరు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని నేరుగా జమ చేసింది. ఒక్క రోజులోనే సుమారు లక్షా 69 వేల మంది రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7,135 కోట్ల భారీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయడం విశేషం.

ఇప్పటికే జూన్ 30 నుంచి ప్రభుత్వం దశలవారీగా రైతు భరోసా నిధులను పారదర్శకంగా విడుదల చేస్తోంది. తొలి విడతలో రెండు ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు సాయం అందించగా.. తర్వాత వరుసగా మూడు, నాలుగు ఎకరాల రైతులకు నిధులు జమ చేసింది.

శుక్రవారం ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా.. ఇప్పుడు ఆరు ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులు కూడా ఈ జాబితాలో చేరారు. వానాకాలం సాగుకు అవసరమైన పెట్టుబడి నేరుగా ఖాతాల్లోకి చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని రైతులు చెబుతున్నారు. మిగిలిన అర్హులైన రైతుల ఖాతాల్లో కూడా త్వరలోనే రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.

#telangana government#support to farmers#owning six-acres#land
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి