ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పుర్కు చెందిన చిన్నారి శ్వేతిమ మాధవ్ ప్రియ.. అంతర్జాతీయ భాగవత ప్రవచనకర్తగా ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో స్థానం సంపాదించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.
2017 ఫిబ్రవరి 16న జన్మించిన శ్వేతిమ.. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక విషయాలపై అమితమైన ఆసక్తి పెంచుకుంది. కేవలం ఆరేళ్ల వయసులోనే శ్రీమద్భాగవత కథలను ప్రవచించడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 36 వారాల పాటు భాగవత ప్రవచనాలు అందించడమే కాకుండా, వందకు పైగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం, నైతిక విలువల గొప్పతనాన్ని ప్రజలకు చేరవేసింది.
ఆమె ప్రవచనాలను వినేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో తెలుసుకుని మరీ వెళ్లి ఆమె మాటలను ఆస్వాదిస్తున్నారు. ఇది కేవలం ఒక చిన్నారి ప్రతిభ మాత్రమే కాదు... ఆధ్యాత్మిక సాధనకు వయసుతో సంబంధం లేదని నిరూపించిన ఉదాహరణ.
ఈ అరుదైన విజయంపై శ్వేతిమ తండ్రి డాక్టర్ సౌరభ్ పాండే ఆనందం వ్యక్తం చేస్తూ, తమ కుమార్తె ఆధ్యాత్మిక ప్రయాణానికి కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. నేటి తరం ఎక్కువగా సాంకేతిక ప్రపంచం వైపు పరుగులు తీస్తున్న కాలంలో.. ఒక చిన్నారి భగవత్ జ్ఞానాన్ని జీవిత ధ్యేయంగా ఎంచుకుని ప్రపంచ రికార్డు సాధించడం నిజంగా విశేషం. భక్తి, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే వయసు ఎప్పుడూ అడ్డంకి కాదని శ్వేతిమ మాధవ్ ప్రియ మరోసారి నిరూపించింది.












