పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలు, సీమాంతర ఉగ్రవాదంపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది. దీనిలో భాగంగా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తోన్న జైషే మహమ్మద్, లష్కరే తాయిబా, అనుబంధ ఉగ్రసంస్థలకు చెందిన 23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. ఈ మేరకు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద వారిని టెర్రరిస్టులుగా పరిగణించినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శనివారం నోటిఫై చేస్తూ ప్రకటన విడుదల చేసింది.
జమ్మూకశ్మీర్లో దాడులకు ప్రణాళికలు, డ్రోన్లతో ఆయుధాల సరఫరా, చొరబాట్లు, టెర్రర్ రిక్రూట్మెంట్ వంటి వాటిల్లో సదరు వ్యక్తులకు ప్రమేయం ఉందని పేర్కొంది. అంతేకాకుండా, ఉపా చట్టం కింద..ఒక వ్యక్తికి ఉగ్రవాద కార్యకలపాల్లో ప్రమేయం ఉందని అనుమానిస్తే.. వారిని ఉగ్రవాదిగా ప్రకటించే అధికారం కేంద్రానికి ఉంది. దాంతో వారి లావాదేవీలను నిలిపివేయడానికి, ఆస్తులను సీజ్ చేయడానికి జాతీయ దర్యాప్తు సంస్థకు వీలు ఉంది. 2019లో చేసిన సవరణల ద్వారా వ్యక్తులను టెర్రరిస్టులుగా ప్రకటించడానికి చాన్స్ ఏర్పడింది. అంతకుముందు గ్రూపులను మాత్రమే ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చేవారు. కానీ,తాజాగా 23 మందితో కలిపి ప్రకటిత ఉగ్రవాదుల సంఖ్య 80కి చేరింది.












