ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకం పరిధిలో హైదరాబాద్లో నిర్మించనున్న ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు తెలంగాణ హౌసింగ్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 28 నుండి 31 వరకు.. 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున పూర్తి పారదర్శకంగా డ్రా తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ శ్రీ వి.పి. గౌతం తెలిపారు.
ఈ లాటరీ ప్రక్రియను ఎటువంటి అనుమానాలకు, అపోహాలకు తావులేకుండా యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ప్రజలు ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడాలంటే.. అధికారిక వెబ్సైట్ tghb.telangana.gov.in సందర్శించాలని తెలిపారు.. అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ సోషల్ మీడియా ఖాతాలైన tghd.official ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో కూడా చూడవచ్చని పేర్కొన్నారు.
మరోవైపు భద్రతా కారణాల వల్ల లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తుదారులందరికీ అనుమతి ఉండదని తెలిపిన అధికారులు.. కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే పెద్ద స్క్రీన్లపై ఈ ప్రక్రియను నేరుగా చూసే అవకాశాన్ని కల్పించారు. ఇక దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, అనర్హుల అభ్యంతరాలను కూడా పరిష్కరించిన తర్వాతే ఈ లాటరీని నిర్వహిస్తున్నట్టు అధికారులు వివరించారు.. అలాగే లాటరీ నిర్వహణ షెడ్యూల్ వివరాలను కూడా విడుదల చేశారు..
లాటరీ నిర్వహణ షెడ్యూల్ వివరాలు
ఆగస్టు 28
కుత్బుల్లాపూర్-గాజులరామారం గండిమైసమ్మ ఫంక్షన్ హాల్
సికింద్రాబాద్ కంటోన్మెంట్-బోయినపల్లి మల్లారెడ్డి గార్డెన్స్
రాజేంద్రనగర్ (మైలార్దేవులపల్లి)-లక్ష్మీగూడ పొదుపు సంఘం హాల్
నాంపల్లి-రెడ్ హిల్స్ వెట్స్ గార్డెన్స్
ఆగస్టు 29
ఖైరతాబాద్ (ఎమ్మెల్యే కాలనీ)-కుమ్రం భీమ్ ఆదివాసీ భవన్.. అలాగే సేవాలాల్ బంజారా భవన్
కూకట్పల్లి-కెపిహెచ్బి కమ్యూనిటీ హాల్
అంబర్పేట-మహారాణా ప్రతాప్ ఫంక్షన్ హాల్
బహదూర్పురా-ఎస్.డి.ఆర్. పెర్ల్ ప్యాలెస్
ఆగస్టు 30
శేరిలింగంపల్లి (రాయదుర్గం ప్రాజెక్టు)-గచ్చిబౌలి నిర్మిత కేంద్ర ప్రాంగణం
మలక్పేట-చంపాపేట సాదియా ఫంక్షన్ హాల్
ఇబ్రహీంపట్నం-బండ్లగూడ రాజీవ్ స్వగృహ కమ్యూనిటీ హాల్
మేడ్చల్-పోచారం స్వగృహ కమ్యూనిటీ హాల్
ఆగస్టు 31
మల్కాజిగిరి (కౌకూర్ ప్రాజెక్టు)-ఆల్వాల్ విబిఆర్ గార్డెన్స్
సనత్నగర్ (పాటిగడ్డ)-హెవెన్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్
మహేశ్వరం (జల్ పల్లి ప్రాజెక్టు)-బడంగ్పేట్ ప్రజా భవన్
కార్వాన్-కుల్సుంపుర ప్రాజెక్టు కేంద్రం..
ఆగస్టు 28 నుండి 31 వరకు పైన ఇచ్చిన కేంద్రాల్లో లాటరీ ప్రక్రియను నిర్వహించనున్నారు. మరోవైపు ఈ పథకంలో దళారులు, మధ్యవర్తుల ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం లేకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు లోబడే ఫ్లాట్ల కేటాయింపు జరుగుతుంది. లాటరీలో పేరు రాకపోయినా దరఖాస్తుదారులు అధైర్యపడవలసిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.
ఇక ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో అన్ని అర్హతలున్నప్పటికీ లాటరీలో పేరు రాలేని దరఖాస్తుదారులు దిగులు పడవద్దనీ, తదుపరి విడతల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్నవి పైలట్ ప్రాజెక్టు మాత్రమే అని, మొత్తం లక్ష ఇండ్లను నిర్మిస్తామని ఆయన తెలిపారు. అంతే కాకుండా అనర్హులైన దరఖాస్తు దారులు కూడా, ప్రభుత్వం త్వరలో ప్రకటించే ఎంఐజి హౌసింగ్ పథకంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
మరోవైపు లాటరీలో పేరు రాకున్నా ఇండ్లు ఇప్పిస్తామంటూ కొందరు మధ్యవర్తులు చేసే అసత్య ప్రచారాలను, వదంతులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు. ఎవరినీ ఆశ్రయించవద్దనీ అధికారులు సూచించారు. మధ్యవర్తులకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా అర్హులైన దరఖాస్తు దారులకే ఇండ్లను కేటాయిస్తామనీ, ఈవిషయంలో ఏమైనా సందేహాలుంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ 040 24603572 కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.. అలాగే ఎవరైనా ఇండ్లు ఇప్పిస్తామంటూ చెప్పిన వారి వివరాలు కూడా కాల్ సెంటర్ ద్వారా తమ దృష్టికి తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు హైదరాబాద్ క్యూర్ పరిధిలో కొత్తగా మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 480 చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గోషామహల్ నియోజకవర్గంలోని నాంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గంలో హయత్నగర్లోని అమంగల్, ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాపూర్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. సెప్టెంబరు 3 లోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు.











