తెలంగాణ

Alleti Maheshwar Reddy: 22ఏ వివాదం.. రాహుల్ గాంధీకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ

రచన: NK26, ఆగ 20266 నిమిషాల పఠనం

22ఏ నిషేధిత భూముల వివాదంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతిలో జరుగుతున్న అవకతవకలు, 22ఏ నిషేధిత భూముల జాబితా ద్వారా జరుగుతున్న అనేక చీకటి ఒప్పందాల మీద రాహుల్ గాంధీ స్పందించాలని.. ఈ తప్పిదాలను వెంటనే సరి చేసి బాధ్యులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

Alleti Maheshwar Reddy: 22ఏ నిషేధిత భూముల వివాదంపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతిలో జరుగుతున్న అవకతవకలు, 22ఏ నిషేధిత భూముల జాబితా ద్వారా జరుగుతున్న అనేక చీకటి ఒప్పందాల మీద రాహుల్ గాంధీ స్పందించాలని.. ఈ తప్పిదాలను వెంటనే సరి చేసి బాధ్యులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రతి నెల 200 కోట్లు మీకు పంపుతున్నట్లుగా మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్లో జరిగే గుసగుసను మేము నమ్మాల్సి వస్తుందన్నారు.

రేవంత్ సర్కార్ భూ దోపిడీకి పాల్పడుతోందని ఏలేటి ఆరోపించారు. ధరణి డిజిటలైజేషన్ ఆడిట్ నివేదికను విడుదల చేయాలన్నారు. అలాగే 2014 నుండి ఇప్పటివరకు 22ఏ కింద సర్వే నెంబర్ల వారీగా చేసిన మార్పులు, చేర్పులు, తొలగింపులను వివరిస్తూ శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. ఆర్థిక లావాదేవీలు, క్విడ్ ప్రో కో వ్యవహారాలపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించాలన్నారు. చట్టబద్ధమైన ప్రైవేట్ భూములు, ఆస్తులన్నింటినీ నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు షరతులు లేని, కాలవ్యవధితో కూడిన నిర్దిష్ట అధికార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ ను డిమాండ్ చేశారు.

''22ఏ నిషేధిత జాబితాకు సంబంధించి ఏం కుట్ర జరుగుతోంది? కుట్రదారులు ఎవరు? ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు, ఆస్తులు ఎవరో కుట్రదారుల ద్వారా నిషేధిత జాబితాలో చేరిస్తే దాని మీద ఎంక్వైరీ పెట్టాల్సిన బాధ్యత మీ మీద లేదా? నిజంగా కుట్ర జరిగి ఉంటే కుట్రదారులు ఎవరో తేల్చండి. అధికారంలో ఉండి.. కుట్ర జరిగిందని మీరే అంటే ఇంతకంటే బాధాకరం మరొకటి లేదు. నిజంగానే కుట్ర జరిగి ఉంటే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించండి. లేదా సీబీఐకి ఇస్తారా లేక హౌస్ కమిటీ వేస్తారా చెప్పండి. ఇవేమీ చెప్పకుండా కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పడం బాధ్యత లేకపోవడమే.

అసలు కుట్ర మీ క్యాబినెట్ లో జరుగుతోంది. కంచె చేను మేసినట్లుగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి షెల్ కంపెనీలకు ఆస్తుల బదలాయింపు జరిగింది. దాని గురించి ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడరు. 22ఏ నిషేధిత భూముల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. గ్రామం, మండలం సర్వే నెంబర్ల వారీగా పూర్తి వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. గత ప్రభుత్వంలో జరిగిన భూ బదలాయింపులపై సమగ్రమైన దర్యాఫ్తు చేయించాలి.

22ఏ బాధితులకు న్యాయం చేయాలి. జిల్లాల వారీగా 22ఏ జాబితా మీద సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలి. 22ఏ నిషేధిత భూముల జాబితా అక్రమాలపై సిట్టింగ్ జడ్డితో న్యాయ విచారణ జరిపించాలి. సీబీఐ విచారణకు ఆదేశించాలి. 22ఏ జాబితాలో భారీ తప్పిదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి సారీ చెప్పడం కాదు రాజీనామా చేయాలి. విచారణ నివేదిక ప్రజలకు బహిర్గతం చేసే వరకు బీజేపీ ప్రశ్నిస్తూనే ఉంటుంది.

మంత్రి పొంగులేటి బినామీ, షెల్ కంపెనీలకు జరిగిన లావాదేవీలపై, ఆస్తుల మార్పిడిపై న్యాయ విచారణ జరపాలి. అప్పటివరకు పదవి నుంచి పొంగులేటిని తొలగించాలి'' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

#Alleti Maheshwar Reddy#22A Lands#Rahul Gandhi#Telangana Congress#Bjp#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తర్వాత చదవండి