Ponguleti Srinivas Reddy: కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మండిపడ్డారు. పేదల ఇళ్లకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గదని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం సాయం చేస్తుందని అనుకున్నాం, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 31 వరకు పూర్తైన ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పేదల కోసం రూ.185 కోట్లు విడుదల చేశామన్నారు. 15వేల 475 మంది లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో చివరి బిల్లులు జమ చేశామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు
''పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడంలో కేంద్రం సహకరించకపోయినా ప్రజా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఏడాదిగా ఎదురు చూశాము. పలు మార్లు ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిని కలిసి విజ్ఞప్తులు కూడా చేశాము. కేంద్రం నుంచి నిధులు వస్తాయని చివరి బిల్లులు కొంతకాలం నిలిపివేశాం. కానీ, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. సీఎం రేవంత్, నేను పలు మార్లు కేంద్రాన్ని కోరినా ఇంకా ఎలాంటి స్పందన రాలేదు'' అని మంత్రి పొంగులేటి వాపోయారు.
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం సహకరించకపోయినా పేదల సొంతింటి కలను నెరవేర్చడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్న 15వేల 475 మంది లబ్దిదారులకు 185 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 31వ తేదీ వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న అర్హులైన లబ్దిదారులకు చివరి బిల్లుల మొత్తం వారి బ్యాంకు ఖాతాల్లో గురువారం జమ అవుతాయి. మిగిలిన వారికి కూడా విడతల వారీగా ఇస్తాము. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా ఇందిరమ్మ ఇంటికి 5లక్షల రూపాయల పూర్తి సబ్సిడీ అందిస్తున్నాం. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు సుమారు 2లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి'' అని మంత్రి పొంగులేటి తెలిపారు.











