కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు, ముఖ్య నాయకుల భేటీలపై రకరకాల ప్రచారాలు వ్యాపిస్తున్న నేపథ్యంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు..
జరగని విషయాలను జరిగినట్టుగా చూపిస్తూ దుష్ప్రచారం చేస్తున్న ఆంధ్రా మీడియాపై మండిపడ్డారు. సదరు ఛానల్ ఎవరికి మద్దతుగా పనిచేస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే మంచిదని, లేదంటే మర్యాద దక్కదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. మీడియా అంటే తనకు గౌరవం ఉందని.. కానీ విలువలు మరచి ప్రవర్తిస్తే భయపడే ప్రసక్తే లేదంటూ పేర్కొన్నారు.
నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఆ ఛానల్ పేరే లేకుండా చేయడం పెద్దవిషయం కాదని హెచ్చరించిన రాజగోపాల్ రెడ్డి.. దిగజారుడు వార్తలతో ఛానల్ పరువు తీసుకోకండని సదరు మీడియా అధిపతిని ఉద్దేశించి హితవు పలికారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్లో పోరాడిన చరిత్ర తమదని, తామే అసలైన కాంగ్రెస్ నాయకులమని ఆయన పేర్కొన్నారు. తమ వద్ద కూడా అనేక న్యూస్ ఛానళ్లను ఏర్పాటు చేసే శక్తి, సత్తా ఉన్నాయని, ఎవరి సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై మీడియా నిజాయితీగా, వాస్తవాల ఆధారంగా మాత్రమే వార్తలను ప్రసారం చేయాలని సూచించారు. తమలాంటి వ్యక్తులను కించపరిచేలా, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఆంధ్రా వార్తా పత్రికలు, న్యూస్ ఛానళ్లు కథనాలు ప్రసారం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
అలాగే మీడియా ముసుగులో కొందరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం సరైన పద్ధతి కాదన్నారు. తాను అన్ని మీడియా సంస్థలను ఉద్దేశించి మాట్లాడటం లేదని, కొందరు వ్యక్తులకు మాత్రమే పనిచేస్తూ వారికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలకు మాత్రమే ఈ హెచ్చరిక చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు..











