* సోషల్ మీడియాపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్
* ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహం
* డీసీసీ అధ్యక్షులకు హైకమాండ్ దిశా నిర్దేశం
రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా ప్రధాన అస్త్రంగా మారింది. గతంలో పత్రికలు, న్యూస్ ఛానెళ్ల మీద ఆధారపడ్డ పార్టీలు ఇప్పుడు... సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. సోషల్ మీడియాలో బలంగా లేకపోతే.. అదో వైఫల్యంగా భావిస్తున్నాయి పార్టీలు.
సోషల్ మీడియా విషయంలో కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. సోషల్ మీడియాలో మీకు ఎన్ని ఖాతాలున్నాయి..వాటిలో ఏమేం పోస్టులు పెడుతున్నారంటూ ఆరా తీస్తున్నారు పార్టీ పెద్దలు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై రోజూ పోస్టులు పెడుతున్నారా? అంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారట. దీంతో డీసీసీ అధ్యక్షులు షాకయ్యారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రచారం మామూలే అయినా.. ఒక్కసారిగా ఆమె నుంచి ఇలాంటి ప్రశ్నలు రావడంతో కాస్త కంగారుపడ్డారట.
ఒక్కొక్క డీసీసీ అధ్యక్షుడితో ఆమె ఫేస్ టు ఫేస్ సమావేశమై పలు ప్రశ్నలు అడుగుతూ వారి పనితీరుపై సమీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా అకౌంట్లపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ప్రశ్నలు ఎదురయ్యాయి.
సోషల్ మీడియా వార్..
అధికార కాంగ్రెస్ కూడా సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ కావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రజలు ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నారని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మరింత దూసుకుపోవాలని పార్టీ శ్రేణులకు హైకమాండ్ పెద్దలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ పథకాలు, ప్రజల కోసం చేపడుతున్న చర్యలను సోషల్ మీడియా వేదికగా వివరించాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు అందుతున్నాయి.
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో ప్రతి ఒక్క నాయకుడికి అకౌంట్ ఉండాలని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేస్తోంది. వీటి ద్వారానే ప్రజలతో టచ్లో ఉండాలని, ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించాలని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఇక్కడ కాస్త ఏమరపాటుతో ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది కొందరి వాదన.
అన్ని పార్టీలదీ అదే దారి..
సోషల్ మీడియా విషయంలో దాదాపు అన్ని పార్టీలు ఒకే రకమైన పంథాను అవలంభిస్తున్నాయి. పార్టీ సొంత అకౌంట్లతో పాటు నాయకుల అకౌంట్ల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నాయి. కొన్ని పార్టీలైతే దీన్ని ఒక ఉద్యమంలా చేస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీకి సోషల్ మీడియా వింగ్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. అందుకే ఈ విషయంలో కాంగ్రెస్ కూడా అప్రమత్తమైంది. ఆ పార్టీకి సోషల్ మీడియా వింగ్ ఉన్నా.. నాయకులకు పర్సనల్గా అకౌంట్స్ ఉన్నాయా లేవా అని ఆరా తీస్తోంది హైకమాండ్. ఒకవేళ అకౌంట్స్ ఉంటే.. నాయకులు అందులో ఎంత యాక్టివ్గా ఉన్నారనే లెక్కలు కూడా తీస్తోంది.
ఒక్క తెలంగాణలోనే కాదు.. ప్రస్తుతం దేశమంతా సోషల్ మీడియా హవానే నడుస్తోంది. పార్టీల మధ్య ప్రత్యక్ష పోరాటం కంటే ఎక్కువగా సోషల్ మీడియా వారే హైలెట్గా నిలుస్తోంది. నాయకులు చేసే ప్రకటనలు, ఎదుటి పక్షాలకు ఇచ్చే కౌంటర్లు అన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచే నడుస్తున్నాయి. అందుకే కాంగ్రెస్ కూడా అలర్టయింది. ఈ విషయంలో ఏ పార్టీ కంటే వెనుకపడొద్దనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే మీనాక్షి నటరాజన్ డీసీసీ అధ్యక్షులను పదే పదే సోషల్ మీడియా అకౌంట్ల గురించి ప్రశ్నించారని తెలుస్తోంది.












