Corona Cases: యావత్ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి.. ఏపీలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో 20 రోజుల వ్యవధిలో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం, వీరిలో నలుగురు మరణించడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో జూన్ 26 నుంచి జూలై 16 వ తేదీ వరకు 12 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వివరాలు తెలిపింది. కడపలో 8, గుంటూరులో 2 కేసులు నమోదయ్యాయి. విశాఖ, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. కరోనా బారిన పడ్డ వారిలో తీవ్రమైన అనారోగ్య సమస్యలతో నలుగురు చనిపోయారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది.
కరోనాకు కారణమయ్యే SARS CoV-2 వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ వ్యాప్తి చెందుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది తీవ్రమైన వ్యాధిని కలిగించకపోయినా ఇన్ఫెక్షన్లు పెరగడానికి అవకాశం ఉందని అంటున్నారు. టీకాల నుంచి లభించే రక్షణ కాలక్రమేణా తగ్గడం కూడా మరో కారణంగా చూపుతున్నారు.












