హైదరాబాద్లోని ప్రముఖ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో సినీ ప్రముఖులు, దగ్గుబాటి సోదరులకు తెలంగాణ ఉన్నత నాయస్థానంలో తీవ్ర చుక్కెదురైంది. తమపై నమోదైన పోలీసు ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ (క్వాష్) దగ్గుబాటి కుటుంబం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు, దానిని తోసిపుచ్చుతూ సంచలన తీర్పు వెలువరించింది. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసిన ధర్మాసనం.. నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరుగుతున్న విచారణకు ఆగస్టు 13న తప్పనిసరిగా హాజరుకావాలని దగ్గుబాటి బ్రదర్స్ను ఖచ్చితంగా ఆదేశించింది.
గతంలో 2022 నవంబర్ 13న జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి దగ్గుబాటి బ్రదర్స్ డెక్కన్ కిచెన్ భవనాన్ని రాత్రికి రాత్రే అక్రమంగా కూల్చివేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో కోట్లాది రూపాయల విలువైన సామగ్రిని ధ్వంసం చేయడమే కాకుండా దొంగిలించారని బాధితుడు నందకుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో 2024 జనవరిలో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు వీరిపై కేసు నమోదైంది. ఈ కేసు నుంచి మినహాయింపు పొందడానికి దగ్గుబాటి కుటుంబం హైకోర్టును ఆశ్రయించగా, సుదీర్ఘ వాదనల అనంతరం న్యాయస్థానం వారి అభ్యర్థనను తీవ్రంగా తిరస్కరించింది.
గత రెండున్నరేళ్లుగా ఆర్థిక, రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ కేసు విచారణకు హాజరుకాకుండా దగ్గుబాటి కుటుంబం కాలయాపన చేస్తోందని బాధితుడు నందకుమార్ ఆరోపిస్తున్నారు. చట్టంలోని లొసుగులను వాడుకుంటూ ఎంతటి ప్రతిబంధకాలు సృష్టించినప్పటికీ, న్యాయవ్యవస్థపై నమ్మకంతో తాము చేసిన ఒంటరి పోరాటానికి ఈరోజు ఫలితం దక్కిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో దిక్సూచిగా ఉండాల్సిన సెలబ్రిటీ హోదా కలిగిన వ్యక్తులు ఇలాంటి అక్రమాలకు పాల్పడటం సరికాదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైకోర్టు క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేయడంతో దగ్గుబాటి బ్రదర్స్కు కోర్టుకు హాజరుకావడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఈ కేసులో ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపి, తమకు జరిగిన అన్యాయానికి తగిన నష్టపరిహారం ఇప్పించడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నందకుమార్ కోరుతున్నారు. ఆగస్టు 13న నాంపల్లి కోర్టులో జరగబోయే విచారణ ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.












