డిజిటల్ విప్లవంతో చిన్నపాటి టీ కొట్టు నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు యూపీఐ చెల్లింపులు సర్వసాధారణంగా మారాయి. అయితే, అత్యంత సులువుగా జరిగే ఈ ఆన్లైన్ పేమెంట్స్ వల్ల తెలియకుండానే ఎక్కువ ఖర్చవుతోందని భావించిన ఓ యువతి వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. గత మూడు నెలలుగా ఆమె యూపీఐని దాదాపు పక్కనపెట్టి రోజువారీ ఖర్చులకు నగదునే వాడటం ప్రారంభించి డబ్బులు ఆదా చేసింది.
ఢిల్లీకి చెందిన సదాఫ్ అనే యువతి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. యూపీఐ ద్వారా చిన్న మొత్తాల్లో వెంటవెంటనే చెల్లింపులు చేయడం వల్ల ఎంత ఖర్చవుతుందో గుర్తించడం కష్టమవుతోందని సదాఫ్ వెల్లడించింది. ఉదాహరణకు స్నాక్స్, కాఫీలు కొన్నప్పుడు తెలియకుండానే వెయ్యి రూపాయలు దాటిపోతున్నాయని తెలిపింది. అదే చేతిలోంచి రూ.500 నోటు తీసి ఇస్తున్నప్పుడు డబ్బు పోతోందనే భావన స్పష్టంగా కలిగి, అనవసర ఖర్చులకు అడ్డుకట్ట పడుతోందని వివరించింది.
బ్యాంకింగ్ యాప్స్ చూడకుండానే పర్సులోని నగదు ఆధారంగా బడ్జెట్ను అంచనా వేయడం సులువవుతోందని పేర్కొంది. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో 100 శాతం నగదుపై ఆధారపడటం సవాళ్లతో కూడుకున్నదని ఆమె అంగీకరించింది. వ్యాపారుల వద్ద చిల్లర కొరత ఉన్నప్పుడు లేదా కచ్చితమైన మొత్తం ఇవ్వాల్సి వచ్చినప్పుడు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది.
అందుకే 80:20' సూత్రాన్ని పాటిస్తున్నట్లు తెలిపింది. ఇందులో 80 శాతం నగదు, అత్యవసర పరిస్థితుల కోసం 20 శాతం యూపీఐ వినియోగించడం వల్ల అలాంటి సమస్యలు తలెత్తవని తెలిపింది. ఈ చిన్న మార్పు తన ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టమైన అవగాహనను, శ్రద్ధను పెంచిందని సదాఫ్ తెలిపింది. అనవసర ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి ఈ నగదు వినియోగ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది. ఆమె పంచుకున్న ఈ టిప్ ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
https://www.instagram.com/reel/DbaqAULy4lp/?utm_source=ig_web_button_share_sheet












