హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి తగ్గిస్తూ చమురు మార్కెటింగ్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో వాణిజ్య సిలిండర్పై సుమారు రూ.200 వరకు తగ్గింపు ప్రకటించడంతో వ్యాపార వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, సరఫరా అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దాని ప్రభావం దేశీయ ఎల్పీజీ ధరలపై కూడా కనిపించింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్ నిర్వహించే వారికి వాణిజ్య గ్యాస్ ధరలు భారంగా మారాయి. అయితే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండటంతో ప్రభుత్వం కూడా ధరలను దశలవారీగా తగ్గిస్తోంది.
ఇప్పటికే జులై నెలలో రూ.183 తగ్గించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి సుమారు రూ.200 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా ధరల ప్రకారం ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,728కు, కోల్కతాలో రూ.2,872.50కు, హైదరాబాద్లో రూ.2,985కు చేరింది. దీంతో వాణిజ్య సంస్థల నిర్వహణ ఖర్చు కొంత మేర తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు.
అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి ఊరట లభించలేదు. 14.2 కేజీల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఇంటి అవసరాలకు గ్యాస్ వినియోగించే ప్రజలు మాత్రం పాత ధరలకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల సమయంలో వాణిజ్య గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించింది. అనంతరం పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో జూన్ నెలలో ఆ ఆంక్షలను ఎత్తివేసి, యుద్ధానికి ముందు ఉన్న స్థాయిలోనే సరఫరాలను పునరుద్ధరించింది.
ఇప్పుడు సరఫరా మెరుగుపడటంతో పాటు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, క్యాటరింగ్ సంస్థలకు కొంత ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది. భవిష్యత్తులో అంతర్జాతీయ ఇంధన మార్కెట్ పరిస్థితులను బట్టి వాణిజ్య గ్యాస్ ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు...












