కర్ణాటకలో కన్నడ మాధ్యమ పాఠశాలలను కాపాడుకునేందుకు ఓ ఉపాధ్యాయుడు అత్యంత వేదనతో వినూత్న నిరసన చేపట్టారు. 1995 సంవత్సరం తర్వాత ప్రారంభమైన కన్నడ మీడియం పాఠశాలలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహాయం (గ్రాంట్-ఇన్-ఎయిడ్) అందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా తన రక్తంతోనే ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ఆ నిధులు లేకపోవడం వల్ల తమ పాఠశాల మూతపడే ప్రమాదంలో పడిందని, తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
శివమొగ్గ జిల్లా శికారిపుర తాలూకాలోని సాలేశ్వర విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ప్రశాంత్ ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. లేఖ రాయడం కోసం ఆయన ముందుగా సిరంజితో తన చేతి నుంచి రక్తాన్ని తీసి కాగితంపై పోశారు. ఆపై తన వేళ్లను ఆ రక్తంలో ముంచి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాశారు. బుధవారం జరగనున్న ప్రజా సేవా ఆందోళన కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మధు బంగారప్పను కలసి ఈ రక్తపు లేఖను వ్యక్తిగతంగా అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
తమ విద్యాసంస్థ గత 31 ఏళ్లుగా గ్రామీణ విద్యార్థులకు కన్నడ మాధ్యమంలో విద్యాబోధన అందిస్తోందని ఉపాధ్యాయుడు ప్రశాంత్ తెలిపారు. గతంలో ప్రభుత్వం గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం అర్హతలను పరిశీలించిన సమయంలో కేవలం ఒక్క రోజు వ్యవధి తక్కువగా ఉండటంతో తమ పాఠశాల ఆ అవకాశాన్ని కోల్పోయిందని వాపోయారు. నాటి నుంచి నిధుల కొరత తీవ్రమై ఉపాధ్యాయుల జీతభత్యాలు, పాఠశాల నిర్వహణ భారంగా మారి సంస్థ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని వివరించారు.
రాష్ట్రంలో మాతృభాషా విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న విషయాన్ని గుర్తుచేస్తూ, 1995 తర్వాత స్థాపించబడిన అన్ని కన్నడ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను తక్షణమే గ్రాంట్-ఇన్-ఎయిడ్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ లేఖపై సానుకూలంగా స్పందించి తమలాంటి అనేక కన్నడ పాఠశాలలను, వాటిపై ఆధారపడిన విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.












