తెలంగాణ

మాపై దాడులు, కేసులు, కుట్రలు.. సాక్ష్యాలతో గవర్నర్‌కు ఫిర్యాదు- కేటీఆర్

రచన: NK11 నిమిషాల పఠనం

Ktr: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, దానికి సంబంధించి సాక్ష్యాలతో గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మా మీద దాడి చేసి, మా మీదే కేసులు పెడుతున్నారని వాపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గవర్నర్ ను కలిసింది.

Ktr: అసెంబ్లీ గేటు దగ్గర బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, దానికి సంబంధించి సాక్ష్యాలతో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మా మీద దాడి చేసి, మా మీదే కేసులు పెడుతున్నారని ఆయన వాపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం గవర్నర్ ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడింది.

బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు కేటీఆర్. తమ పార్టీ అధినేత కేసీఆర్ నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించారని ఆయన ఆరోపించారు. దీన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మా పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలపై దాడి చేయడమే కాకుండా తిరిగి మాపైనే అక్రమ కేసులు పెట్టారని గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ తెలిపారు.

''రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గవర్నర్ కు వివరించాము. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వంలోకి వచ్చి వెయ్యి రోజులైనా వాటిని అమలు చేయని వైనాన్ని, ప్రజలు ఎంత బాధ పడుతున్నారనే విషయాన్ని గవర్నర్ కు వివరంగా చెప్పాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కనీసం యూరియా కూడా దొరకడం లేదు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి గవర్నర్ కి తెలిపాము. మూడుసార్లు రైతు బంధు ఎగ్గొట్టారు. రైతు బీమాకు బంద్ పెట్టి రైతుల కుటుంబాల్లో ధీమా లేకుండా చేసిన విషయాన్ని గవర్నర్ కు తెలిపాము.

2 లక్షల ఉద్యోగాల పేరుతో, జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన వైనాన్ని గవర్నర్ కు తెలిపాము. పాలిటెక్నిక్ విద్యార్థుల మీద ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాన్ని గవర్నర్ కు చెప్పాం. మాకు ఎన్ని అవమానాలు జరిగినా, మా మీద ఎన్ని కేసుల పెట్టినా అన్నీ తట్టుకుంటాం.

శాసనసభలో ప్రజా సమస్యలపై మాట్లాడదామని అసెంబ్లీకి వెళ్లాం. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున మేము చేసిన నేరం ఏంటి? చేసిన తప్పు ఏంటి? పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే నల్ల టీ షర్ట్ వేసుకున్నారో.. మేము కూడా అలానే వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలకు అన్యాయమే జరిగింది, ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింట మోసమే మిగిలిందని నల్ల టీ షర్టులు వేసుకుని నిరసన తెలుపుదామని అసెంబ్లీకి వెళ్లాం.

సభా ప్రాంగణంలో అడుగు పెట్టక ముందే నడిరోడ్డు మీద పోలీసులు మా మీద దాడి చేశారని గవర్నర్ కు చెప్పాం. దానికి సంబంధించిన వీడియోలు కూడా చూపించాము. దేశంలోనే మొట్టమొదటి మహిళా హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి మీద మగ పోలీసులు దాడి చేశారు. దీనిపై ఆధారాలతో సహా గవర్నర్ కు సమర్పించాము. పోలీసులు సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి దుశ్శాసన పర్వానికి ఎలా తెరలేపారో ఆధారాలతో సహా గవర్నర్ కి చూపించాం.

దాడి జరిగింది మా మీద, ఇబ్బంది పెట్టింది మమ్మల్ని, మళ్లీ కేసులు పెట్టింది మా మీదే అని గవర్నర్ కు వివరించాము. అసెంబ్లీ మొదటి రోజే మా మీద జరిగిన దాడిని ఆధారాలతో సహా గవర్నర్ కు చూపించాం. తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ చావు కోరుతూ, ఆయన ఇంటి మీద దాడికి యత్నించడం దారుణం. దీన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం'' అని కేటీఆర్ తెలిపారు. తమ ఫిర్యాదుపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని కేటీఆర్ వెల్లడించారు. పోలీసులతో వివరాలు తెప్పించుకుంటానని గవర్నర్ తమతో చెప్పినట్ల కేటీఆర్ వెల్లడించారు.

'గవర్నర్ ఈరోజు మాకు సమయం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశాము. కేసీఆర్ ఆదేశాల మేరకు గవర్నర్ ని కలిశాము. 1000 హామీలతో అధికారంలోకి వచ్చి, 1000 రోజులైనా హామీల అమల్లో విఫలం కావడంతో పాటు పరిపాలనలోనూ పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ సర్కార్ తీరును గవర్నర్ కి వివరించాము. కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారో ఆయనకు తెలియజేశాము. రాష్ట్రంలోని రైతన్నలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించాము. రాష్ట్రంలోని నిరుద్యోగ విద్యార్థులు, యువతను రాహుల్ గాంధీ ఏ విధంగా మోసం చేశారో గవర్నర్ కి విజ్ఞప్తి ద్వారా తెలియజేశాము.

రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న ఆందోళన, వారి డిమాండ్లను వివరించాము. మొన్న శాసనసభ సమావేశాల మొదటి రోజు మా పైన ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసులు చేసిన దాష్టీకాన్ని గవర్నర్ కి వివరించాము. రాహుల్ గాంధీ పార్లమెంటులో నిరసన తెలిపిన తీరులోనే, టీ-షర్ట్స్ ద్వారా నిరసన తెలపాలని మేము అనుకున్నాము. మా హక్కులను కాలరాస్తూ, శాసనసభ్యులమైన మమ్మల్ని సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్న తీరును గవర్నర్ కి వివరించాము.

మాపై జరిగిన దాడిని, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడిని ఫోటోలు, ఆధారాలతో సహా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాము. మా మహిళా నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి దుశ్శాసన పర్వానికి తెరలేపిన తీరును వివరించాము. మాపై దాడి చేసి, తిరిగి మమ్మల్నే బద్నాం చేస్తున్న కాంగ్రెస్ కుట్రను కూడా వివరించాము. మా పార్టీ నాయకులతో పాటు అందరిపైనా దాడి చేయడానికి వెళ్లిన పోలీసులపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోని తీరును గవర్నర్ కి తెలియజేశాము.

చివరికి కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిన తీరును వివరించాము. దాంతో పాటు కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా దాడి చేసేందుకు వెళ్లిన విషయాన్ని కూడా తెలియజేశాము. హైకోర్టు చెప్పినా శాసనమండలి, శాసనసభలోకి మమ్మల్ని రాకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరును వివరించాము.

ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, కోర్టులపై ఎలాంటి గౌరవం లేదని గవర్నర్ కి తెలియజేశాము. అందుకే ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేశారని వివరించాము.

శాసనమండలి సభ్యులు అనని మాటలను అన్నట్లుగా ఆపాదిస్తూ, జరగని అవమానాన్ని జరిగినట్లుగా చూపిస్తూ దళిత స్పీకర్ పేరిట రాజకీయం చేస్తున్నారని వివరించాము. ‘దళిత స్పీకర్’ అంటూ రాజకీయాలు చేస్తున్నారని తెలియజేశాము.

మాకు స్పీకర్ పైన అపారమైన గౌరవం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీనే ఆయనను దళిత స్పీకర్ అంటూ అవమానించేందుకు చూస్తున్నదని వివరించాము. అందుకే అది శాసనసభ కాదు, కౌరవ సభ అని అంటున్నామని తెలియజేశాము. అది సభ కాదు, దుశ్శాసన సభ అని గవర్నర్ కి తెలియజేసి, మొత్తం పరిస్థితిని వివరించాము.

కేసీఆర్ ఇంటిపై దాడి చేస్తూ, హత్యాయత్నానికి ప్రభుత్వం ప్రయత్నించిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే స్వయంగా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నారని వివరించాము. కేసీఆర్ లాంటి మహా నాయకుడి ఇంటి వద్ద చావు డప్పు కొడుతూ, ఆయన చావును కోరిన దుర్మార్గం గురించి వివరాలను గవర్నర్ కి అందించాము. శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన అంశాలతో పాటు, బయట జరిగిన ప్రతి సంఘటనపైన, మేము చెప్పిన ప్రతి అంశంపైన విచారణ జరిపిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు.

మాకు గవర్నర్ ఇచ్చిన హామీ మేరకు, ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యకాండలో ఆయన జోక్యం చేసుకుంటారని భావిస్తున్నాము. కేవలం తెలంగాణ ప్రజల తరఫున న్యాయం అడిగి, హామీలు అమలు చేయాలని కోరినందుకే మాపై దాడులు చేశారని గవర్నర్ కి తెలియజేశాము. ప్రభుత్వం విడుదల చేసిన అన్ని ఏఐ ఫోటోలు, వీడియోలపై ఈ అంశంలో ఇప్పటికే ఫిర్యాదు చేశాము. తప్పుడు చిత్రాలు, తప్పుడు ఫిర్యాదులు ఉపయోగించే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటాము. తెలంగాణలో న్యాయం జరగకుంటే, జాతీయ స్థాయిలో ఉన్న జాతీయ మహిళా కమిషన్‌ను కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేస్తాము'' అని కేటీఆర్ అన్నారు.

#Ktr#Brs#Governor#Lok Bhavan#Brs Mlas#Telangana Assembly#Shiv Pratap Shukla#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి