ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల కోసం ఒక వినూత్న విప్లవాత్మక సేవను అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ప్రయాణికులే ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సి రాగా, ఇకపై ఇమ్మిగ్రేషన్ సేవే నేరుగా ప్రయాణికుల వద్దకు వచ్చేలా 'క్లిక్ & ట్రావెల్' పేరుతో కొత్త మొబైల్ వ్యవస్థను ప్రారంభించింది. దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) రూపొందించిన ఈ ప్రత్యేక సేవ ద్వారా విమానాశ్రయంలో రద్దీ సమయంలో లేదా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా ఎంట్రీ, ఎగ్జిట్ ప్రక్రియలను పూర్తి చేయడానికి వీలవుతుంది.
ఈ నూతన విధానంలో భాగంగా పాస్పోర్ట్ కంట్రోల్ అధికారులు అధునాతన సాంకేతిక పరికరాలతో టెర్మినల్ అంతటా సంచరిస్తుంటారు. సెంట్రల్ డేటాబేస్కు అనుసంధానమై ఉన్న ఈ పరికరాల ద్వారా అధికారులు ప్రయాణికుల సమాచారాన్ని క్షణాల్లో పరిశీలిస్తారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియ సహాయంతో కేవలం 12 నుంచి 15 సెకన్ల వ్యవధిలోనే ప్రయాణికుడి గుర్తింపును నిర్ధారించి ఇమ్మిగ్రేషన్ పూర్తి చేస్తారు. ఫలితంగా సుదీర్ఘమైన లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా ప్రయాణికులకు సమయం గణనీయంగా ఆదా కానుంది.
ప్రస్తుతానికి ఈ సర్వీస్ ప్రయాణికుల రాకపోకల రకాన్ని బట్టి లభ్యమవుతోంది. దుబాయ్ నుంచి వేరే ప్రాంతాలకు బయలుదేరే (Departure) విభాగంలో యూఏఈ పౌరులతో పాటు నివాసితులు, అంతర్జాతీయ సందర్శకులు కూడా ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చు. అదే సమయంలో దుబాయ్కు చేరుకునే (Arrival) ప్రయాణికులకు సంబంధించి మొదటి దశలో కేవలం యూఏఈ పౌరులు, నివాసితులకు మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇతర దేశాల నుంచి వచ్చే విజిటర్లకు కూడా ఈ సేవలను విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కాగా మే 2026లో ప్రారంభమైన ఈ 'క్లిక్ & ట్రావెల్' పైలట్ ప్రాజెక్ట్ అత్యంత విజయవంతమైందని GDRFA తెలిపింది. ఆగస్టు 31, 2026 నాటికి ఈ విధానం ద్వారా ఏకంగా 31,373 లావాదేవీలను అధికారులు సునాయాసంగా పూర్తి చేశారు. ఇది కేవలం సేవల వేగాన్ని పెంచడం మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా ప్రయాణికుల అనుభవాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని దుబాయ్ ఐడెంటిటీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అహ్మద్ అల్ మర్రి వెల్లడించారు.








