తెలంగాణ శాసనసభ మూడో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే సభలో తీవ్రమైన రాజకీయం, గందరగోళ వాతావరణం నెలకొంది. సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాంహౌస్ వద్ద మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నేతలు, వివిధ దళిత సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. అయితే, నిరసనకారులు వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్ నాయకులు పాలతో, నీళ్లతో శుద్ధి చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సభ వేదికగా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య సభలో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది.
దళిత సంఘాల ప్రతినిధులు నిరసన తెలిపిన స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు శుద్ధి చేయడం వెనుక వారి తీవ్రమైన కుల వివక్ష బయటపడిందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సభలో ధ్వజమెత్తారు. ఈ దారుణ చర్య యావత్ దళిత సమాజ ఆత్మగౌరవాన్ని, రాజ్యాంగం కల్పించిన హక్కులను తీవ్రంగా అవమానించడమేనని మండిపడ్డారు. ఇటీవల దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను అసెంబ్లీ గేటు వద్ద నిందించిన ఉదంతాన్ని గుర్తుచేస్తూ, బీఆర్ఎస్కు దళితుల పట్ల ఉన్న చులకన భావం మరోసారి బహిర్గతమైందని ఆరోపించారు. ఈ శుద్ధి వ్యవహారంపై శాసనసభలో వెంటనే సమగ్ర చర్చ చేపట్టాలని పట్టుబట్టారు.
అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. మంత్రి ప్రసంగానికి అడ్డుతగులుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకేసారి వెల్లోకి దూసుకొచ్చి పోడియంను చుట్టుముట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని, విధుల్లో ఉన్న పోలీసులు మహిళలను ఇబ్బందులకు గురిచేయడంపై ప్రభుత్వం తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన తమ పార్టీ మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దౌర్జన్యాన్ని మరుగున పరిచేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని తెరపైకి తెస్తోందని ఆరోపిస్తూ ప్లకార్డులతో హోరెత్తించారు.
ఒకవైపు బీఆర్ఎస్ నేతల కుల వివక్షను ఎండగడుతూ కాంగ్రెస్ సభ్యులు, మరోవైపు మహిళా ఎమ్మెల్యేల రక్షణ, పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు పోటీపడి నినాదాలు చేయడంతో సభలో ఉద్రిక్తత శిఖరాగ్రానికి చేరింది. స్పీకర్ స్థానంలో ఉన్న ప్యానెల్ స్పీకర్ కడియం శ్రీహరి సభ్యులను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఇరువైపులా ఆగని నిరసనలతో మూడో రోజు సమావేశాలు తీవ్ర హంగామా మధ్య కొనసాగాయి. దాదాపు గంటసేపటి నుంచి బీఆర్ఎస్ సభ్యులు సభను అడ్డుకుంటున్నారని మంత్రి తెలిపారు. వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ను కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది.











