అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసపటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరినీ సస్పెండ్ చేస్తూ ప్రకటించారు. ఈ సెషన్ మొత్తం వారిని బహిష్కరించినట్టు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ పొడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. మార్షల్స్ వారిని బయటకు పంపించినట్టు సమాచారం. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు.
అయితే, సెషన్స్ ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు.నిన్న ఎర్రవెల్లిలో కాంగ్రెస్ ఎస్సీ సంఘాల నేతృత్వంలో జరిగిన దండోరా కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ .. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చావును కోరుకుంటోందని.. ఈ అంశం మీద చర్చ జరపాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. నిన్నఎర్రవల్లికి బయలు దేరే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కేసీఆర్ చనిపోవాలి... ఆయన చావును మేం కోరుకుంటున్నాం’ అని వ్యాఖ్యానించారు.
ఆ కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అదేవిషయాన్ని నేడు శాసనసభలో ప్రస్తావించిన హరీశ్ రావు సభలో ఈ అంశం మీద చర్చ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చర్చ జరిపేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అంగీకరించలేదు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభలో గట్టిగా నినాదాలు చేశారు. చావుడప్పుపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేయడంతో వారిని సస్పెండ్ చేయాలంటూ మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టారు.గంటసేపటి నుంచి సభను అడ్డుకుంటున్నారని, వారిని సస్పెండ్ చేయాలంటూ స్పీకర్ను కోరారు.ఆ తీర్మానాన్ని ఆమోదించి సభ జరిగినన్ని రోజులు సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
సస్పెండ్ అయిన వారిలో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కోవాలక్ష్మి, సునీత, పాడికౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.ఇదిలాఉండగా, బీఆర్ఎస్ ఆందోళనల నడమ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ‘మా ప్రభుత్వం గానీ, మా ఎమ్మెల్యేలు గానీ, ఈ సభ గానీ.. కేసీఆర్ చావు కోరుకోవడం లేదు’ అని క్లారిటీ ఇచ్చారు. ‘మా కాంగ్రెస్ ఎవరి చావు కోరుకునే పార్టీ కాదు’ అని మంత్రి శ్రీధర్ బాబు సైతం వెల్లడించారు.












