తెలంగాణ భాషాదినోత్సవం సందర్బంగా కాళోజీ నారాయణ రావు జయంతిని పరస్కరించుకుని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సోషల్ మీడియాలో కీలక పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా యువతకు ముఖ్య సూచన చేశారు.కాళోజీ స్ఫూర్తితో నేటితరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ‘అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు?’.. అంటూ, తోటి సమాజం ఎదుర్కొంటున్న కష్టాలను తన కన్నీటితో కలిపి పంచుకున్న తెలంగాణ మనసు కవి, ప్రజాకవి పద్మవిభూషణ్, కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రికే.చంద్రశేఖర్ రావు ఘననివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కాళోజీతో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ జన జీవితానికి పర్యాయపదంగా నిలిచిన కాళోజీ జీవన ప్రస్థానమంతా, తెలంగాణ భాషను, యాసను, మేళవించి తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటన దిశగా సాగిందన్నారు.తెలంగాణ సాధన కోసం తాను ప్రారంభించిన మలి దశ పోరాటంలో..‘దోపిడీ చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతర వేస్తం’ అనే స్ఫూర్తి ఇమిడి వున్నదని కేసీఆర్ తెలిపారు.
పాలకుల అన్యాయం అక్రమాలపై ధిక్కారమే తన నైజమని చాటిన కాళోజీ సాహిత్య స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శనీయమన్నారు.కాళోజీ నారాయణ రావు గారి కృషిని గౌరవిస్తూ వారి జయంతిని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం "తెలంగాణ భాషా దినోత్సవం"గా ప్రకటించిందని గుర్తు చేశారు.
తెలంగాణ సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన కవులు, రచయితలను ప్రతిఏటా ‘‘కాళోజీ నారాయణరావు’’ పురస్కారాలతో సత్కరించే సంప్రదాయాన్ని ప్రారంభించామన్నారు.వారి పేరుతో కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నెలకొల్పామని కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాలకుల దుర్నీతిని ఎండగడుతున్న యువత, కాళోజీ స్ఫూర్తితో ముందుకు సాగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రశ్నించడం వల్లే పాలకుల్లో జవాబుదారితనం పెరుగుతుందన్నకోణంలో యువతను ఆలోచింపజేసేలా కేసీఆర్ పోస్టు ఉందంటూ గులాబీ శ్రేణులు చెబుతున్నారు.









