తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ప్రతిపక్ష మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు, భద్రతా బృందాలు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు పి.సబితా ఇంద్రారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక చిట్ చాట్లో అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఘటనలను వివరిస్తూ వారు తీవ్రంగా ఆవేదన చెందారు. అసెంబ్లీ గేట్ల వద్ద మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగుతూ, గొంతు నులిమి భౌతిక దాడులకు పాల్పడితే ఈ ప్రభుత్వానికి కనీసం పట్టింపు లేకపోవడం దారుణమని మండిపడ్డారు.
అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమకు ఫోన్ చేశారని సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. స్పీకర్ స్థానానికి ఇచ్చే గౌరవంలో ఎలాంటి లోటు ఉండకూడదని, సభలోని ప్రతీ ఒక్కరూ విచారం వ్యక్తం చేయాలని కేసీఆర్ స్పష్టంగా ఆదేశించారని తెలిపారు. సభలో మంత్రులు స్పీకర్ తల్లి గారి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురవుతున్నారని, మరి ప్రతిపక్షంలో ఉన్న తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తుంటే తాము కూడా మహిళలమేననే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మరిచిపోతోందని సూటిగా ప్రశ్నించారు.
అసెంబ్లీ ఆవరణలో తమపై జరిగిన దాడి ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిందని మాజీ మంత్రులు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల మహిళా నేతలు తమకు వ్యక్తిగతంగా ఫోన్లు చేసి సానుభూతిని తెలిపారని, సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. స్వయంగా హైకోర్టు కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి సీసీటీవీ విజువల్స్ నివేదిక కోరడం తమ ఆరోపణల నిజాయితీకి అద్దం పడుతోందని వివరించారు.
సాధారణంగా శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో బయట ఎక్కడైనా చిన్న ఘటన జరిగినా సభలో ప్రభుత్వం లేదా స్పీకర్ పక్షాన ప్రకటన చేయడం ఆనవాయితీ అని సబితా ఇంద్రారెడ్డి గుర్తుచేశారు. కానీ సాక్షాత్తూ అసెంబ్లీ ప్రాంగణంలోనే మహిళా శాసనసభ్యులపై భౌతిక దాడులు జరిగితే, ప్రభుత్వం నుంచి కనీసం ఒక ప్రకటన లేదా విచారం లేకపోవడం వారి నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.










