పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు మళ్లీ పతాక స్థాయికి చేరుకున్నాయి. జోర్డాన్లోని తమ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన క్షిపణి దాడికి ప్రతికారంగా అమెరికా మిలిటరీ ఇరాన్లోని వ్యూహాత్మక లక్ష్యాలపై దాదాపు రెండు గంటల పాటు విరుచుకుపడి వైమానిక దాడులు (Airstrikes) జరిపింది. చర్చలకు అవకాశం ఇచ్చేందుకు డొనాల్డ్ ట్రంప్ దాడులు నిలిపివేసిన కొద్ది రోజులకే ఈ ఊహించని పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ఐదు బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా, యూఎస్ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని విజయవంతంగా గాలిలోనే కూల్చివేసింది. అయినప్పటికీ, తమ బలగాలపై దాడికి దిగినందుకు బలమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ఇరాన్లోని మిలిటరీ స్థావరాలపై విరుచుకుపడింది.
ఈ దాడిలో ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన మిలిటరీ కమాండ్ సెంటర్లు, క్షిపణి, డ్రోన్ ఉత్పత్తి కేంద్రాలు, తీరప్రాంత నిఘా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దళం బాంబుల వర్షం కురిపించింది. ఈ తీవ్ర దాడుల ధాటికి ఇరాన్లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్, బుషెహర్ సహా అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి పరిధిలోని 'ఖెష్మ్' ద్వీప ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
తమ దళాలపై వచ్చే ఎలాంటి బెదిరింపులనైనా సహించేది లేదని, ఇరాన్ క్షిపణి దాడికి ఇది అత్యంత 'శక్తిమంతమైన సమాధానం' అని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తాజా ఘటనలతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి.












