యాంటీ పేపర్ లీక్ బిల్లు చర్చ సమయంలో కీలక పరిణామాలు
సభలో కనిపించని ప్రధాని, కేంద్ర హోంమంత్రి
బీజేపీని టార్గెట్ చేసిన కాంగ్రెస్
ఈ బిల్లుపై బీజేపీ వ్యూహమేంటి..?
యాంటీ పేపర్ లీక్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన రోజు నుంచి అది పాస్ అయ్యే వరకు జరిగిన కొన్ని పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ ప్రధానంగా ఆ అంశాలపై ఫోకస్ చేసి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. అందులో ప్రధానమైంది ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా సభలో కనిపించకపోవడం. అసలు వీరిద్దరూ కీలక బిల్లుపై చర్చలో ఎందుకు పాల్గొనలేదు..? దీన్నే ఆయుధంగా చేసుకున్న కాంగ్రెస్.. విద్యార్థుల ఆందోళనలపై పోలీసుల చర్యల విషయంలో అమిత్ షాను నిలదీస్తూ, బిల్లుపై చర్చను మరింత రాజకీయంగా మార్చేందుకు ప్రయత్నించింది.
ప్రతిపక్షం టార్గెట్ ఎవరు..?
లోక్సభలో బిల్లుపై చర్చ మొదలైన వెంటనే అసలు చర్చ పేపర్ లీక్ల నుంచి విద్యార్థుల నిరసనల వైపు మళ్లింది. రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులపై పోలీసు చర్యలకు బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం కూడా బిల్లుపై కంటే ఆ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అందుకే మోదీ, షా దూరంగా ఉన్నారా..?
ఈ బిల్లును ప్రభుత్వం పూర్తిగా విద్యార్థుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన సంస్కరణగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావించి ఉండొచ్చని అంటున్నారు. అలాంటి సమయంలో మోదీ, అమిత్ షా నేరుగా చర్చలో పాల్గొంటే, ప్రతిపక్షం మొత్తం చర్చను వ్యక్తిగత ఆరోపణల వైపు మళ్లించే అవకాశం ఉండేదనేది కొందరి వాదన. అందుకే సంబంధిత మంత్రులే బిల్లును ముందుకు తీసుకెళ్లగా, మోదీ-షా ప్రత్యక్షంగా చర్చలోకి దిగకుండా రాజకీయంగా ఒక అడుగు వెనక్కి వేసి ఉండొచ్చనే విశ్లేషణ వినిపిస్తోంది.
కానీ కాంగ్రెస్ ఈ అంశాన్ని బాగా హైలెట్ చేసింది. బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సభలో ప్రధాని, కేంద్ర హోంమంత్రి లేకపోవడాన్ని ఆ పార్టీ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో బిల్లు ఆమోదం పొందేదాకా సరైన చర్చనే జరగలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యాంటీ పేపర్ లీక్ బిల్లు అసలు ఉద్దేశం పరీక్షల్లో అక్రమాలకు కఠిన శిక్షలు తీసుకురావడమే. కానీ సభలో జరిగిన చర్చలో ఎక్కువ సమయం విద్యార్థుల ఆందోళనలు, ఢిల్లీ ఘటనలు, పోలీసు చర్యలు, అమిత్ షాపై ఆరోపణల చుట్టూనే తిరిగింది.
బీజేపీ నష్టనివారణ వ్యూహమా..?
రాజకీయంగా చూస్తే ఇది డ్యామేజ్ కంట్రోల్ వ్యూహం కూడా అయి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. విద్యార్థుల అంశం భావోద్వేగాలకు సంబంధించినది. దీనిపై మోదీ లేదా అమిత్ షా నేరుగా స్పందిస్తే వివాదం మరింత పెరిగే అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మంత్రుల ద్వారా బిల్లును పాస్ చేయించడం వల్ల చర్చను పరిమిత స్థాయిలో ఉంచాలనే ప్రయత్నం జరిగి ఉండొచ్చనేది ఒక అంచనా.
ఎలాగోలా బిల్లయితే పాసైంది. కానీ దీనిపై పూర్తిస్థాయి చర్చ జరిగి ఉంటే ఇంకా బాగుండేది. ఈ మొత్తం వ్యవహారంలో చర్చకంటే ఎక్కువగా విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల లాఠీఛార్జ్పైనే వాదనలు సాగాయి. ఐతే బిల్లుపై చర్చ సందర్భంగా బీజేపీ వ్యూహాత్మక నిశ్శబ్ధాన్ని ఎంచుకుందా? లేక ప్రతిపక్ష విమర్శలకు వేదిక ఇవ్వకూడదనే నిర్ణయమా? అనే ప్రశ్నకు అధికారిక సమాధానమైతే లేదు.












