Ravi Teja: ఒక్క ఇరుముడి సినిమా ఎంతగా ప్రభావం చూపిస్తుందో రవితేజ వరుస ప్రాజెక్ట్స్ ని ప్రకటించడంతోనే అర్థమవుతోంది. ధమాకా తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయిన రవితేజ..అనూహ్యంగా కొన్ని ప్రాజెక్ట్స్ హోల్డ్ అయిపోయాయి. ఇక, ఈ ప్రాజెక్ట్స్ పక్కన పడినట్టే అని అంతా భావించారు. ఒక చిత్రానికైతే అసలు నిర్మాతే కరువయ్యాడు. దీనికి, కారణం రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉండటమే.
ఈ ఆగస్టు 21న ఫ్యామిలీ కంటెంట్తో, తండ్రీకూతుళ్ళ ఎమోషనల్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు శివ నిర్వాణ రూపొందించిన ఇరుముడి సినిమా వచ్చింది. ముందు నుంచి పెద్దగా అంచనాలైతే ఈ సినిమాపై లేవనే చెప్పాలి. కానీ, అయ్యప్ప మాలాధరణ, ప్రమోషనల్ కంటెంట్తో అంతకంతా అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇక్కడ, కథ మాత్రమే మాట్లాడింది. ఫ్లాపుల్లో ఉన్న శివ నిర్వాణ, రవితేజ ఎఫెక్ట్ మాత్రం సినిమా రిలీజైయ్యాక కనిపించింది.
ఇప్పటి వరకూ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న లెక్కల ప్రకారం 135 కోట్లకి పైగానే వసూళ్ళు రాబట్టింది ఇరుముడి చిత్రం. ఈ సినిమా సూపర్ సక్సెస్తో హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా సెట్స్పైకి రాబోతోంది. జనవరి 14, 2027 రిలీజ్ అని కూడా ప్రకటించేశారు. శ్రీవిష్ణు మరో హీరోగా నటించనున్నాడు. ఇక, ఈ సినిమాకి 'దాగుడుమూతల దండాకోర్' అని టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. వాస్తవానికి, ఇరుముడి గనక హిట్ కాకపోయి ఉంటే, దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తెచ్చేవాడే కాదు.
అయితే, అలాంటి మరో క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది. వివేక్ ఆత్రేయ చెప్పిన హర్రర్ కథ కూడా మన మాస్ రాజాకి నచ్చేసింది. కానీ, నిర్మాతలే లేక ఇన్నాళ్ళు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయింది. ఇక, ఇరుముడి కొట్టిన భారీ సక్సెస్తో ఈ సినిమాకి నిర్మాతలు దొరికారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాతలు లక్ష్మణ్, శ్రీని కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. తాజాగా, విషయాన్ని మేకర్స్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. దీంతో, ఒక్క 'ఇరుముడి' సక్సెస్ మళ్ళీ రవితేజను ఫుల్ ఫాంలోకి తెచ్చిందంటున్నారు. ఇది, వందకి వంద శాతం వాస్తవం.












