Indiramma Houses: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. కులం, మతం, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ఇళ్ల కేటాయింపు జరుగుతోందన్నారు. మరో 10 రోజుల్లో రెండో విడత లబ్దిదారుల జాబితా విడుదల చేస్తామన్నారు. 16 నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించి టెండర్లు పూర్తి చేస్తామన్న మంత్రి పొంగులేటి రెండు మూడు రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ లో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కు లక్కీ డ్రాలో మంత్రి పాల్గొన్నారు. క్యూర్ పరిధిలో తొలి విడతలో భాగంగా 7,350 ఇళ్ల కేటాయింపులకు సంబంధించి లక్కీ డ్రా ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పాదర్శకంగా నిర్వహిస్తోందని మంత్రి వెల్లడించారు.
క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్లలో ఫ్లాట్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయిస్తోంది ప్రభుత్వం. తొలి విడతలో 7,350 ఇళ్లను అర్హులకు అందించనుంది. కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి నియోజకవర్గాల్లో లక్కీ డ్రా నిర్వహించింది.
రెండు మూడు రోజుల్లో నిర్మాణ పనులు
ఇప్పటికే 16 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలు సేకరించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు టవర్ల నిర్మాణ పనులు మొదలు పెడతారని పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా వందల కోట్ల రూపాయల విలువైన భూముల్లో సైతం ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.
పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు
''లాటరీలో ఇల్లు పొందిన ఆడబిడ్డలకు ఏడాదిలోపే ఇళ్లు నిర్మించి వారి పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాము. రిజిస్ట్రేషన్ కు కూడా ఒక్క రూపాయి తీసుకోము. 17 నుంచి 20 గజాల స్థలం అన్ డివైడెడ్ షేర్ల భూమితో కలిపి అద్భుతంగా 525 స్వ్కేర్ ఫీట్లతో ఇంటిని ఆడబిడ్డ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం. పదేళ్ల తర్వాత ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని ఏమైనా చేసుకోవచ్చు. తనకు అవసరం ఉంటే అమ్ముకోవచ్చు కూడా. ఆ కండీషన్ తోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నాము.
తాకట్టు పెడితే 60 లక్షలు లోన్!
ఏదైనా అవసరానికి తాకట్టు పెట్టాలనుకుంటే రిజిస్ట్రేషన్ అయిన తెల్లవారే క్లియర్ టైటిల్ తో ఉంటుంది కాబట్టి తాకట్టు పెట్టుకోవచ్చు. కొడుకు చదువు కోసమో, బిడ్డ పెళ్లి కోసమో, ఇతరత్రా అవసరాల కోసం ఆ ఆడబిడ్డ ఆ ఇంటిని తాకట్టు పెట్టుకుంటే 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయలు లోన్ కింద ఇస్తారు. ఇంటి స్థలం ఖరీదే 50 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటుంది. ఆడబిడ్డ కట్టే 6 లక్షలు కాకుండా అదనంగా మరో 5లక్షలు వేసి రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ఈ 16 నియోజకవర్గాలే కాకుండా మరో నాలుగు నియోజకవర్గాల్లోనూ స్థలాలు గుర్తించాం. అక్కడ కూడా టెండర్లు ఆహ్వానిస్తున్నాం. ఇప్పటివరకు 20 నియోజకవర్గాల్లో లబ్దిదారులను ఫైనల్ చేస్తున్నాము'' అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.












