మనిషికి ప్రకృతి అంటే ప్రేమ, భయం రెండు లేవని ప్రకృతి ప్రేమికులు వాపోయిన సందర్భాలు ఉన్నాయి.. కానీ ఏదైనా విపత్తు ఏర్పడితే మాత్రం గగ్గోలు పెడుతూ ప్రకృతిని నిందించడం మాత్రం తెలుసు.. కానీ ప్రకృతిని కాపాడుకుంటూ.. మానవ ఉనికికి ప్రమాదం లేకుండా చూసుకుందాం అనే దిశగా మాత్రం ఆలోచనలు చేయకపోవడం వల్ల పెను విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి..
ప్రతి అనుభవం ఒక గుణపాఠంగా నేర్చుకోవలసిన మనిషి నిర్లక్ష్యం వల్ల నేడు ప్రకృతి అస్తవ్యస్తంగా మారి పలు వైపరీత్యాలకు దారి తీస్తుంది. ఇక వరుసగా దేశవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తుల వల్ల ఎందరో విగత జీవులుగా మారుతున్నారు. లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.. ఈ నేపథ్యంలో నేపాల్ ను కూడా ప్రకృతి
వణికిస్తుంది. ఈ ప్రాంతంలో ఇటీవల కురిసిన కుంభవృష్టి వల్ల సుమారు 272 మంది మృతి చెందగా పలువురు గల్లంతు అయ్యిన విషయం తెలిసిందే..
అయితే ఈ ఆకస్మిక వరదలపై ఐదు నెలల ముందే ప్రమాద ఘంటికలు మోగినట్టు కథనాలు వెలువడుతున్నాయి.. ఖాట్మండు కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్మెంట్ ఈ ఏడాది మార్చిలోనే హిందూకుష్ హిమాలయాల్లో హిమానీనదాలు ప్రమాదకర స్థాయిలో కరుగుతున్నాయని రెండు నివేదికల ద్వారా హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతుంది..
మరోవైపు 2000 సంవత్సరం నుంచి హిందూకుష్ హిమాలయాల్లో మంచు కరిగే వేగం రెట్టింపు అయిందని ఐసీఐఎంఓడీ తాజాగా నివేదిక వెల్లడించింది.. 1975 నుంచి ఇప్పటివరకు దాదాపు 27 మీటర్ల మంచు పొర కరిగిపోయిందని, 1990-2020 మధ్య కాలంలో ఈ ప్రాంతంలోని హిమానీనదాలు తమ మొత్తం విస్తీర్ణంలో 12 శాతం, మంచు నిల్వల్లో 9 శాతాన్ని కోల్పోయినట్టు పేర్కొంది.
ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని, ఈ విపత్తును ఆపడం సాధ్యం కాకపోవచ్చని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇక నేపాల్ వరదలకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతున్నప్పటికీ.. గతంలో కేవలం మంచు కురిసే 4,000 మీటర్ల ఎత్తైన ప్రాంతాల్లో ఇప్పుడు వర్షాలు కురవడం, వేగంగా మంచు కరగడం, ఎత్తైన శిఖరాల నుంచి మంచు, రాళ్ల చరియలు విరిగిపడి నదుల్లో కలవడం వల్లే ఈ ఆకస్మిక వరదలు సంభవించినట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో వాతావరణ మార్పుల వల్ల భూమి వేడెక్కడంతో మంచు కరిగి, కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరుగుతోందని ఐసీఐఎంఓడీ నిపుణుడు మహ్మద్ ఫరూక్ అజమ్ పేర్కొన్నారు. ధ్రువ ప్రాంతాల తర్వాత ప్రపంచంలోనే అత్యధిక మంచు నిల్వలు హిమాలయాల్లోనే ఉన్నాయని తెలిపిన ఆయన ఇక్కడి నుంచి ప్రవహించే 10 ప్రధాన నదీ వ్యవస్థలపై సుమారు రెండు బిలియన్ల మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు హిమాలయాల్లో మంచు కరుగుదల వేగం పెరగడం.. కేవలం పర్వత ప్రాంతాలకే కాదు, యావత్ ఆసియాకు పెను ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.












