తమ జీవనాధారం తొలగించారని, న్యాయం చేయాలని రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న బాధితులపై పోలీసులు దారుణంగా ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో డబ్బా దుకాణాల తొలగింపును నిరసిస్తూ బాధితులు నిరసనకు దిగారు. ఆ ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఘటనా స్థలికి చేరుకున్న కోదాడ టౌన్ సీఐ శివశంకర్.. ఆందోళన చేస్తున్న మాదాల ఉపేందర్పై దాడికి పాల్పడినట్టు సమాచారం.అతన్ని అందరి ముందే నెట్టేయడంతో బాధితుడు కిందపోయిన దృశ్యాలు వీడియోలో స్పష్టం కనిపిస్తోంది.
బాధితులతో సీఐ ప్రవర్తించిన తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతున్నారు. జీవనాధారం కోల్పోయిన వారు నిరసన చేస్తే ఇలాగేనా వారితో ప్రవర్తిస్తారా? అంటూ సోషల్ మీడియా వేదికగా సీఐ శివశంకర్ తీరును ఎండగడుతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకివెళితే..సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 32వ వార్డులో రాత్రికి రాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు
షాపులను తొలగించారు. అయితే, మున్సిపల్ కమిషనర్కు పండుగ మామూళ్లు ఇవ్వనందుకే తమ షాపులను అధికారులు తొలగించారని బాధితులు ఆరోపించారు.మున్సిపల్ కమిషనర్, అధికారుల తీరును నిరసిస్తూ నడిరోడ్డుపై బాధితులు ఆందోళనకు దిగారు. అయితే, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు వారితో మాట్లాడుతుండగా.. వాగ్వాదం నెలకొన్నట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే అక్కడకు చేరుకున్న కోదాడ సీఐ శివశంకర్.. ఆందోళన చేస్తున్న మాదాల ఉపేందర్పై దాడికి యత్నించారు. అతని నెట్టివేయడంతో పాటు కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. అడ్డొచ్చిన మహిళలను నెట్టేసి నడిరోడ్డుపై సీఐ వీరంగం సృష్టించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.కాగా, జీవనాధారం కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి దాడికి పాల్పడిన సీఐ మీద చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.












