Raidurg Lands: హైదరాబాద్ రాయదుర్గం భూములు కాసుల పంట పండిస్తున్నాయి. ఇక్కడి భూములు మరోసారి రికార్డ్ ధరలు పలికాయి. రాయదుర్గంలో తాజాగా నిర్వహించిన వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.269 కోట్లకు అమ్ముడైంది. వారం రోజుల క్రితం (ఈ నెల 21) ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.264 కోట్లు పలకగా.. తాజాగా ఆ రికార్డ్ బద్దలైంది.
5.38 ఎకరాల భూమికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ఈ-వేలం నిర్వహించింది. ఎకరానికి రూ.175 కోట్లను కనీస ధరగా నిర్ణయించింది. 5.38 ఎకరాల ‘ప్లాట్-P2’ వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ.269కోట్ల ధరకు అమ్ముడైంది. ఈ లెక్కన 5.38 ఎకరాలకు రూ.1,447 కోట్లు విలువ పలికింది. దీంతో TGIICకు భారీగా ఆదాయం సమకూరనుంది.
అంతకుముందు గత వారం జరిగిన ‘ప్లాట్-P1’ వేలంలో ఎకరాకు రూ.264 కోట్ల చొప్పున రూ.1,386 కోట్లు వచ్చాయి. మొదటి ప్లాట్కు సంబంధించిన 25 శాతం తొలి విడత నిధులు కూడా ఇప్పటికే టీజీఐఐసీ ఖాతాకు చేరాయి. వారం రోజుల వ్యవధిలోనే ఈ రెండు ప్లాట్లకు (మొత్తం 10.63 ఎకరాలు) సంబంధించి రూ.2,833.22 కోట్ల భారీ రాబడి లభించింది. ఈ వేలంలో సగటున ఎకరా ధర రూ.266.53 కోట్లుగా నమోదవడం విశేషం.
రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఈ రికార్డు ధరలే నిదర్శనం అని టీజీఐఐసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశాంక ఐఏఎస్ అన్నారు. పారదర్శక విధానాల ద్వారా ప్రభుత్వ ఆస్తులకు గరిష్ట విలువను సమకూర్చడంలో రాయదుర్గం వేలం ఒక మైలురాయిగా నిలిచిందన్నారు.












