బ్యాంకు అంటే ప్రజలు తమ కష్టార్జిత సంపాదనను నమ్మకంతో దాచుకునే చోటు. భవిష్యత్ అవసరాల కోసం, పిల్లల చదువుల కోసం, అత్యవసర పరిస్థితుల కోసం, వృద్ధాప్య భద్రత కోసం ఎంతో మంది తమ జీవితకాల పొదుపులను బ్యాంకుల్లో జమ చేస్తారు. అలాంటి బ్యాంకుల్లోనే అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు బయటపడితే సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది.
తాజాగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్న గోల్కొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో రూ.12 కోట్ల కుంభకోణం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. బ్యాంకు సీఈవో, క్లర్క్ కుమ్మక్కై డిపాజిటర్ల డబ్బును అక్రమంగా మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2008 నుంచి 2011 మధ్య జరిగిన ఈ అక్రమాలు ఇప్పుడు బయటపడటంతో డిపాజిటర్లు ఆందోళనకు దిగారు.
ఇలాంటి ఘటనల వల్ల ఎక్కువగా నష్టపోయేది సామాన్యుడే.. ఎన్నో కుటుంబాల కలలు ఛిన్నాభిన్నం అవుతాయి. కొందరు పిల్లల చదువుల కోసం దాచిన డబ్బు కోల్పోతారు. మరికొందరు వైద్య ఖర్చుల కోసం పెట్టిన పొదుపులు ప్రమాదంలో పడతాయి. రైతులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగ విరమణ చేసిన వృద్ధులు.. ఇలా బ్యాంకుపై ఆధారపడిన ప్రతి ఒక్కరూ మానసిక వేదనకు గురవుతారు.
బ్యాంకుల అసలు లక్ష్యం ప్రజల డబ్బును భద్రంగా ఉంచడం, అవసరమైనప్పుడు రుణాలు అందించడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. కానీ కొందరు అధికారులు స్వార్థం కోసం వ్యవస్థను దుర్వినియోగం చేస్తే, నష్టపోయేది అమాయక ప్రజలే. ఇలాంటి కుంభకోణాలు సహకార బ్యాంకులపై కూడా ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
అందుకే ఇలాంటి ఆరోపణలపై సమగ్ర విచారణ జరగడం, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం. అదే సమయంలో డిపాజిటర్ల డబ్బుకు పూర్తి రక్షణ కల్పించడం ప్రభుత్వాలు, సంబంధిత శాఖల బాధ్యత. ప్రజలు కూడా తమ ఖాతాల లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఏవైనా అనుమానాస్పద అంశాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయదం బాధ్యతగా భావించాలి..












