PIB Fact Check: సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ లు పెద్ద సంఖ్యలో ప్రచారం అవుతున్నాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వం ముద్రతో అవాస్తవ ప్రకటనలు క్రియేట్ చేసి జనాల్లోకి వదులుతున్నారు. అవి నిజమో కాదో తెలుసుకోకుండానే జనాలు వాటిని గుడ్డిగా ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఇది సైబర్ క్రిమినల్స్ మాయాజాలం అని తెలుసుకోలేక అడ్డంగా బుక్కవుతున్నారు. తమ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో మరో ఫేక్ ప్రకటన జోరుగా ప్రచారం అవుతోంది.
నిరుద్యోగుల కోసం కేంద్రం కొత్త స్కీమ్ తెచ్చిందని, దాని పేరు ప్రధానమంత్రి నిరుద్యోగ భృతి పథకం అని ప్రచారం జరుగుతోంది. ఈ పథకం కింద దేశంలోని నిరుద్యోగులందరికీ కేంద్రం 2వేల 500 రూపాయలు ఇవ్వనుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారిక ఫ్యాక్ట్ చెకింగ్ (నిజ నిర్ధారణ) విభాగం.. PIB (ప్రెస్ ఇన్ ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.
ఇది ఫేక్ ప్రచారం అని స్పష్టం చేసింది. అందులో నిజం లేదని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని తీసుకురాలేదని, అమలు చేయడం లేదని క్లారిటీ ఇచ్చింది. ఫేక్ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. ఈ స్కీమ్ పేరుతో బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఓటీపీ, ఆధార్ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని తెలియని లేదా ధృవీకరించని ప్లాట్ ఫామ్స్ లో పంచుకోవద్దని సూచన చేసింది.












