Telangana High Court: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఇవాళ జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అసెంబ్లీ గేటు దగ్గర పోలీసులు తమ పార్టీ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న ఘటనపై కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలోకి వెళ్లకుండా ఎమ్మెల్యేలను అడ్డుకోరాదని పోలీసులను ఆదేశించింది.
సభ్యులు ఒక వేళ శానససభా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ దేనని, పోలీసులది కాదని తేల్చి చెప్పింది. ఎమ్మెల్యేలపై పోలీసులు చర్యలు తీసుకోవడానికి వీల్లేదన్న కోర్టు.. సభ్యులు నిబంధనలు ఉల్లంఘించినట్లు భావిస్తే వారిపై స్పీకర్ తగిన చర్యలు తీసుకోవచ్చంది.
అసెంబ్లీ వ్యవహారాల్లో స్పీకర్ అధికారాలే కీలకం అని న్యాయస్థానం స్పష్టం చేసింది. అసెంబ్లీ గేటు వద్ద మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాడి అంశాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడ్డ పోలీసులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. పోలీసులపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించిన హైకోర్టు.. కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.












